ఈసారి వడ్డీ రేట్లు పెంచకపోవచ్చు: ఎకానమిస్టులు

ఈసారి వడ్డీ రేట్లు పెంచకపోవచ్చు: ఎకానమిస్టులు

న్యూఢిల్లీ: ఈసారి ఆర్​బీఐ ఎంపీసీ వడ్డీ రేట్లు పెంచకపోవచ్చని ఎకానమిస్టులు చెబుతున్నారు. ఇదే రేట్లను కొనసాగించే ఛాన్స్​ ఎక్కువని వారు పేర్కొంటున్నారు. రిజర్వ్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా (ఆర్​బీఐ) మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) మీటింగ్​ త్వరలో జరగనుంది. ఏప్రిల్​ నెల సమావేశంలో రేట్లను 6.5 శాతం వద్దే   కొనసాగించాలని ఆర్​బీఐ ఎంపీసీ నిర్ణయించింది. పెరుగుతున్న ఇన్​ఫ్లేషన్​ను కట్టడి చేసేందుకు అంతకు ముందు కొంతకాలంగా వడ్డీ రేట్లను ఆర్​బీఐ ఎంపీసీ పెంచుతూ వచ్చింది. రాబోయే ఎంపీసీ మీటింగ్​​ రెండు కీలకమైన అంశాలపై ఫోకస్​ పెడుతుందని ఎక్యూయైట్​ రేటింగ్స్​ అండ్​ రీసెర్చ్​ చీఫ్​ ఎకానమిస్ట్​ సుమన్​ చౌదరి చెప్పారు. రిటెయిల్​ ఇన్​ఫ్లేషన్​లో చెప్పుకోదగ్గ తగ్గుదల, క్యూ4లో జీడీపీ మెరుగ్గా ఉండటం...అనే రెండింటిపైనా ఫోకస్​ ఉంటుందని పేర్కొన్నారు.

వరుసగా రెండోసారి ఏప్రిల్​2023 లోనూ ఆర్​బీఐ టార్గెట్ కంటే తక్కువగా అంటే 4.70 శాతంగా రిటెయిల్​ ఇన్​ఫ్లేషన్​ రికార్డయింది. ఇది 18 నెలల కనిష్టం కూడా. మరోవైపు హోల్​సేల్​ ప్రైస్​ ఇండెక్స్​34 నెలల కనిష్ట లెవెల్​కి చేరింది. ఫుడ్ ​ఇన్​ఫ్లేషన్​ తగ్గడం, కమొడిటీ ఖర్చులు తక్కువవడం, ఆర్​బీఐ వడ్డీ రేట్లను పెంచడం వంటి కారణాల వల్లే ఇన్​ఫ్లేషన్​ తగ్గిందని చౌదరి వివరించారు. కన్జూమర్​ ప్రైస్​ ఇన్​ఫ్లేషన్​(సీపీఐ) తగ్గుదల ఈ ఫైనాన్షియల్​ ఇయర్లో కంటిన్యూ అవుతుందని అంచనా వేస్తున్నామని, సర్వీసెస్​లో గ్రోత్​ మొమెంటమ్​ పటిష్టంగా ఉండటం వల్ల కోర్​ఇన్​ఫ్లేషన్​లో కొంత ఇబ్బంది ఉండొచ్చని అన్నారు. ఈ ఫైనాన్షియల్​ ఇయర్లో సీపీఐ 5.3 శాతంగా రికార్డవచ్చని, ఇంతకు ముందు ఏడాది ఇది 6.6 శాతంగా ఉందని పేర్కొన్నారు. క్యూ4 జీడీపీ మార్కెట్​ అంచనాలను మించిందని, కానీ ఆ క్వార్టర్లో ప్రైవేట్​ కన్జంప్షన్​ 2.8 శాతానికే పరిమితమైందని చౌదరి చెప్పారు.

పైన పేర్కొన్న పరిస్థితుల నేపథ్యంలో ఆర్​బీఐ ఎంపీసీ ఈసారి వడ్డీ రేట్లను ఇప్పుడున్న చోటే కొనసాగించే అవకాశాలే ఎక్కువని పేర్కొన్నారు. వడ్డీ రేట్లలో కోత వెంటనే ఉండకపోవచ్చని మరో ఎకానమిస్ట్​ చర్చిల్​ భట్​ చెప్పారు. పాత రేట్లనే కొనసాగిస్తారనే అంచనా వేస్తున్నట్లు కోటక్ ​మహీంద్రా ఈవీపీ చర్చిల్​ భట్​ పేర్కొన్నారు. వడ్డీ రేట్ల పెంపుదల ఎఫెక్ట్​ ఎకానమీలో రిఫ్లెక్ట్​ కావడం వల్లే ఇన్​ఫ్లేషన్​ దిగొచ్చిందని, రేట్లను ఇప్పుడు పెంచాల్సిన అవసరమైతే లేదని ఇందిరా గాంధి ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ డెవలప్​మెంట్​ రీసెర్చ్​ ఎమెరిటస్​ ప్రొఫెసర్​ ఆశిమా గోయెల్​ అన్నారు. ఇటీవల జరిగిన ఎంపీసీ సమావేశాలలో ఆశిమా గోయెల్​తోపాటు, ఐఐఎం ప్రొఫెసర్​ జయంత్​ ఆర్​ వర్మ కూడా రెపో రేటు పెంపుదలను వ్యతిరేకించిన విషయం తెలిసిందే. వచ్చే వారంలో 6 నుంచి 8 తేదీల దాకా ఆర్​బీఐ ఎంపీసీ మీటింగ్​ జరగనుంది.