రెడీమిక్స్ ప్లాంటును తరలించాలి

రెడీమిక్స్ ప్లాంటును తరలించాలి

ఘట్ కేసర్, వెలుగు:  ఘట్​కేసర్ మండలం కాచివానిసింగారం పంచాయతీ పరిధిలోని రెడీమిక్స్​ప్లాంటును అక్కడి నుంచి తరలించాలని కోరుతూ స్థానిక కాలనీలవాసులు శనివారం రోడ్డెక్కారు. ప్లాంట్​నుంచి పంచాయతీ ఆఫీసు వరకు భారీ ర్యాలీ నిర్వహించి, అక్కడ ధర్నాకు దిగారు. కాలనీల జేఏసీ అధ్యక్షుడు భరత్ రెడ్డి మాట్లాడుతూ.. ఇటీవల గ్రామంలో ఏర్పాటు చేసిన  రెడీమిక్స్ ప్లాంట్​తో కాలుష్యం పెరిగిపోయిందని వాపోయారు. 

ప్లాంట్ నుంచి విడుదలవుతున్న దుమ్ముతో చర్మ, శ్వాస సంబంధిత వ్యాధులు వస్తున్నాయని చెప్పారు. ఇటీవల కాలనీకి చెందిన ఓ మహిళ మృతికి ప్లాంట్ నుంచి వచ్చే దుమ్మునే కారణమని తెలిపారు. జిల్లా స్థాయి అధికారులకు ఫిర్యాదు చేసినా రెడీమిక్స్ యజమాన్యానికే వత్తాసు పలుకుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్లాంట్ తొలగించే వరకు పోరాటం కొనసాగిస్తామని చెప్పారు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కర్రే రాజేష్, బీజేపీ నాయకులు బసవరాజుగౌడ్ నిరసనకు మద్దతు తెలిపారు.