పరిగెత్తించి..రాళ్లతో కొట్టిన రికవరీ ఏజెంట్లు

పరిగెత్తించి..రాళ్లతో కొట్టిన రికవరీ ఏజెంట్లు
  •     భయంతో చెరువులో దూకిన యువకుడు
  •     మునుగుతున్నా వదలకుండా  బండలేయడంతో మృతి
  •     ఖమ్మం జిల్లా కేంద్రంలో దారుణం
  •     రూ.4 వేలు కట్టనందుకు సొంత వాహనం సీజ్​
  •     పూచీకత్తుగా ఉన్న వెహికిల్​ డబ్బులు చెల్లించాలని ఒత్తిడి 
  •     వెంటాడి వేధించి ప్రాణం తీసిండ్రు 

ఖమ్మం టౌన్,  వెలుగు :  ఖమ్మంలో దారుణం చోటుచేసుకుంది. టూ వీలర్​ కిస్తీ చెల్లించలేదని ఓ కస్టమర్ ను పరిగెత్తిస్తూ ​మీద రాళ్లేస్తూ వెంటపడడంతో భయంతో చెరువులో దూకాడు. అయినా వదలకుండా అలాగే రాళ్లేయడంతో బయటకు రాలేక ..ఊపిరాడక ప్రాణాలు కోల్పోయాడు. స్థానికులు, మృతుడి బంధువుల కథనం ప్రకారం..యూపీలోని ఆగ్రా సమీపంలో ఉన్న అయ్యేలా గ్రామానికి చెందిన వినీత్​ బతుకుదెరువు కోసం ఖమ్మం వచ్చి మార్బుల్ కార్మికుడిగా పని చేస్తున్నాడు. ఇతడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. కొన్ని నెలల కింద వినయ్, ఇతడి మేస్త్రీ అజయ్ ఠాగూర్ కలిసి వైరా రోడ్డులోని టూ వీలర్ షోరూంలో కొంత డౌన్ ​పేమెంట్ ​కట్టి మోహనసాయి ఆటో ఫైనాన్స్​లో రెండు టూ వీలర్లు తీసుకున్నారు.

 మొదట్లో కిస్తీలు సరిగ్గానే కట్టినా ఈ మధ్య పని లేక కట్టలేదు. వినీత్​ వాహనంపై రూ.4 వేలు, ఠాగూర్ వెహికల్​పై రూ.14 వేలు పెండింగ్​లో ఉన్నాయి. దీంతో రికవరీ ఏజెంట్లు రామచందర్, అజయ్ కుమార్ నాలుగు రోజుల కింద వినీత్​ టూ వీలర్ స్వాధీనం చేసుకున్నారు. ఠాగూర్​ కనిపించకపోవడంతో ఆయన వెహికల్​కు పూచీకత్తుగా ఉన్నావని, అతడి డబ్బులు క్టటాలని ఒత్తిడి చేస్తున్నారు. నాలుగు రోజులుగా అతడి వెంటపడుతూనే ఉన్నారు. ఎక్కడికి వెళ్లినా వదలడం లేదు. 

వెంటాడి రాళ్లదాడి..చెరువులో పడ్డా వదల్లే   

రికవరీ ఏజెంట్ల వేధింపులు భరించని వినీత్​ ​భయంభయంగానే తిరుగుతున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం బల్లేపల్లి వద్ద వినీత్​ ఓ బండిపై వస్తూ  రికవరీ ఏజెంట్లు రామచందర్, అజయ్ కుమార్  కంట పడ్డాడు. దీంతో వారు వినీత్​ను పట్టుకోబోగా తప్పించుకుని ​టూ వీలర్ పై కొంతదూరం పారిపోయాడు. అయినా వదలకుండా వెంటాడడంతో వెహికల్​ వదిలేసి పరిగెత్తాడు. అయినా చేతికి దొరికిన రాళ్లు విసురుతూ వెంబడించారు.  భయంతో పరిగెత్తుతున్నా వెంటాడడం ఆపలేదు. చెరువు అడ్డం రావడంతో వినీత్​ వేరే వైపు పరుగు తీశాడు. 

అక్కడ కూడా రాళ్లేస్తుండడంతో భయపడి దిక్కుతోచక ఖానాపురం ట్యాంక్​బండ్​చెరువులో దూకాడు. చెరువులో దూకిన వినీత్​ను కాపాడాల్సిన రికవరీ ఏజెంట్లు ఆ పని చేయకుండా మళ్లీ మీద బండలు విసిరారు. అప్పటికే పరిగెత్తి ఆయాసంతో ఉండడం, బయటకు రాకుండా రాళ్లేస్తుండడంతో ఊపిరాడక చనిపోయాడు. వినీత్​ ​పరిగెత్తుతున్న  దృశ్యాలతో పాటు ఏజెంట్లు వెంటపడి రాళ్లేసే విజువల్స్ ​స్థానికుల ఇండ్లలోని సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఇవి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఖానాపురం సీఐ భాను ప్రకాష్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను అదుపులోకి తీసుకున్నామని చెప్పారు.