భారతదేశంలో ప్రాంతీయ అసమానతలు

భారతదేశంలో ప్రాంతీయ అసమానతలు

దేశంలోని కొన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందడం, మరికొన్ని రాష్ట్రాలు వెనుకబడి ఉండటం, అలాగే, రాష్ట్రాల్లో  కొన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందడ, మరికొన్ని ప్రాంతాలు వెనుకబడి ఉండటాన్ని ప్రాంతీయ అసమానతలుగా పిలుస్తారు. 

కారణాలు

సహజ సిద్ధమైన అంశాలు: భౌగోళికంగా కొన్ని ప్రత్యేక ప్రాంతాలు ఇతర ప్రాంతాలతో సంఘటితమై ఉండకపోవడం. ఉదా: జమ్ముకశ్మీర్​, అండమాన్​ నికోబార్​ దీవులు.


సహజ వనరులు: సహజ వనరులు సమృద్ధిగా లభించే ప్రాంతాల్లో పెట్టుబడులు ఎక్కువగా తరలివచ్చి అభివృద్ధి చెందుతాయి. 
చారిత్రక అంశాలు: అవస్థాపన, మార్కెటింగ్, వాణిజ్య సౌకర్యాలు ఎక్కువగా ఉన్నచోట ఆంగ్లేయులు పెట్టుబడులను ఎక్కువగా ప్రోత్సహించారు. ఉదా: కలకత్తా, చెన్నై, బొంబాయి.
 

హరిత విప్లవం: నీటిపారుదల సదుపాయాలు ఎక్కువగా ఉన్న పంజాబ్​, హర్యానా, పశ్చిమ ఉత్తరప్రదేశ్​ల్లో హరిత విప్లవం ప్రవేశపెట్టడంతో అక్కడి రైతుల ఆర్థిక స్థితిగతులు మరింత మెరుగపడ్డాయి. నీటి వసతి లేని కరువు ప్రాంతాలు, ఈశాన్య భారత్​లో హరిత విప్లవం విస్తరించకపోవడంతో అక్కడ వెనుకబాటుతనం కనిపిస్తుంది. 

ప్రభుత్వ విధానం: 1951లో ప్రవేశపెట్టిన ఐఆర్​డీఏ ప్రాంతీయ అసమానతలను తగ్గించడంలో విఫలమైంది. రూర్కెలా, బిలాయ్​ తదితర ఇనుము ఉక్కు కర్మాగారాలను వెనుకబడిన ప్రాంతాల్లో స్థాపించబడినప్పటికీ అవి మూలధన సాంద్రత పరిశ్రమలు అయినందు వల్ల ఆశించిన ఫలితాలను పొందలేకపోయాయి. ప్రణాళిక వ్యయం కేటాయింపులు అభివృద్ధి చెందిన రాష్ట్రాలకు ఎక్కువగా జరిగాయి. 

నూతన ఆర్థిక సంస్కరణలు: పరిశ్రమలు స్థాపించడంలో గల అవరోధాలను సంస్కరణలు తగ్గించాయి. దీంతో విదేశీ సంస్థలు అవస్థాపనా సదుపాయాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోనే పెట్టుబడి పెట్టాయి. అంటే సంస్కరణల ఫలాలు వెనుకబడిన ప్రాంతాలకు చేరలేదు. 

కొలిచే సూచీలు: ప్రాంతీయ అసమానతలు కొలవడం క్లిష్టమైన ప్రక్రియ. తలసరి ఆదాయంలోని వ్యత్యాసాలు ద్వారా సాధారణంగా రాష్ట్రాల మధ్య వ్యత్యాసాలను గణిస్తారు. అయితే, రాష్ట్రంలోని అసమానతలను ఇది తెలియజేయదు. పారిశ్రామిక వృద్ధి, వ్యవసాయ వృద్ధిలోని తేడాలు, రాష్ట్రాంలోని అక్షరాస్యత స్థాయి, మొత్తం పని వారిలో మ్యాన్యుఫ్యాక్చరింగ్​ రంగంలోని పనివారి వాటా, రోడ్ల పొడవు, శిశు మరణరేటు మొదలైనవి ప్రాంతీయ అభివృద్ధిలోని వ్యత్యాసాలను తెలుసుకోవడానికి ఉపయోగపడుతాయి. 

ఎన్​ఎస్డీపీ వృద్ధిరేటు: ప్రాంతీయ అసమానతలు తెలియజేసే ప్రధాన సూచీల్లో ఎన్​ఎస్​డీపీ వృద్దిరేటు ఒకటి. ఎన్​డీపీ వృద్ధిరేటులో 2020–21లో మణిపూర్​, పశ్చిమబెంగాల్​ ముందంజలో ఉండగా, మిజోరాం, ఉత్తరప్రదేశ్​ చివరిలో ఉన్నాయి. సంస్కరణల తర్వాత అభివృద్ధి చెందిన రాష్ట్రాల వృద్ధిరేటు వెనుకబడిన రాష్ట్రాల కంటే ఎక్కువగా ఉంది.  

తలసరి ఆదాయంలో వ్యత్యాసాలు: ప్రధాన రాష్ట్రాల్లో 1960–61లో తలసరి ఆదాయంలో మహారాష్ట్ర ప్రథమ స్థానంలో ఉండేది. ఈ మధ్య హర్యానా ప్రథమ స్థానంలోకి వచ్చింది. 2020–21లో పెద్ద రాష్ట్రాల్లో కర్ణాటక అధిక తలసరి ఆదాయాన్ని  కలిగి ఉంది. బిహార్​ తక్కువ తలసరి ఆదాయాన్ని కలిగి ఉంది. హర్యానా, కర్ణాటక, కేరళ, ఉత్తరాఖండ్​, తెలంగాణలు అధిక తలసరి ఆదాయాన్ని కలిగి ఉండగా, బిహార్​, ఉత్తరప్రదేశ్​, జార్ఖండ్​, అస్సాంలు తక్కువ తలసరి ఆదాయం కలిగి ఉన్నాయి. 

అవస్థాపనా సదుపాయాల్లో వ్యత్యాసాలు: అవస్థాపన సౌకర్యాల సూచీలైన తలసరి విద్యుత్​ వినియోగం, వాహనాల రిజిస్ట్రేషన్​, రోడ్ల పొడవు, టెలికం కలెక్షన్లు, సాగు భూమిలో నీటి సౌకర్యాలు ఉన్న భూమి శాతం మొదలైనవి ప్రాంతీయ వ్యత్యాసాలను తెలుసుకోవడానికి ఉపయోగపడుతాయి. 

పేదరిక ప్రభావం: పేదరికం కూడా ఆర్థిక వెనుకబాటుతనానికి సూచీయే. 2011–12 ఎన్​ఎస్​ఎస్​ఓ వారి 68వ రౌండ్​లో భారత పేదరికం 21.9శాతం, ప్రధాన రాష్ట్రాలు తీసుకుంటే కేరళ, హిమాచల్​ప్రదేశ్​, పంజాబ్​ల్లో పేదరిక శాతం తక్కువగా, చత్తీస్​గఢ్​, జార్ఖండ్​ల్లో పేదరికం ఎక్కువగా ఉంది. 
వ్యవసాయాభివృద్ధిలో అసమానతలు: పంజాబ్​, హర్యానా, ఉత్తరప్రదేశ్​లోని కొన్ని భాగాలు మిగతా రాష్ట్రాలతో పోలిస్తే అధిక ప్రగతిని కనబరుస్తున్నాయి. దీనికి కారణం నూతన వ్యవసాయ వ్యూహం కొన్ని ప్రాంతాలకే పరిమితం కావడం.. 

సాంఘిక అవస్థాపన, మానవాభివృద్ధి : ఆర్థికాభివృద్ధి ప్రాథమిక లక్ష్యం మానవ సంక్షేమం. సాంఘిక రంగంలో కేరళ మంచి ప్రగతిని కనబరుస్తుంది. కేరళ, తమిళనాడు రాష్ట్రాలు తక్కువ తలసరి ఆదాయాలు కలిగి ఉన్నా అధిక మానవాభివృద్ధిని సాధిస్తున్నాయి.

దీనికి కారణం విద్య, ఆరోగ్య రంగాల్లో పెట్టుబడి పెట్టడమే. కేరళ అక్షరాస్యత (94 శాతం), స్త్రీ అక్షరాస్యత (91.9 శాతం), సెక్స్​ రేషియో (1084), ఐఎంఆర్​ (0)లో మెరుగ్గా ఉంది. మరోవైపు బిహార్​, రాజస్థాన్​, మధ్యప్రదేశ్​లు మానవాభివృద్ధిలో వెనుకబడి ఉన్నాయి. హర్యానా, పంజాబ్​లు, ధనిక రాష్ట్రాలైనప్పటికీ అక్షరాస్యత, స్త్రీ, పురుష నిష్పత్తిలో వెనుకబడి ఉన్నాయి. అంటే ఒక సమాజంలో తలసరి ఆదాయమనేది ఆర్థిక, సామాజిక ప్రగతికి సరిపడినంత కొలమానం కాదు.