ఒక రాజ వంశం.. మొత్తం ప్రతిపక్షానికి సమానం కాదు

ఒక రాజ వంశం.. మొత్తం ప్రతిపక్షానికి సమానం కాదు

కాంగ్రెస్‌ వారసత్వ రాజకీయాలపై జేపీ నడ్డా మండిపాటు
న్యూఢిల్లీ: తూర్పు లడఖ్‌లో ఇండియా‌‌–చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో మన జవాన్లు చనిపోవడంపై ప్రధాని మోడీని టార్గెట్‌గా చేసుకుంటూ కాంగ్రెస్ నేతలు వరుస విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ విమర్శలను బీజేపీ నేతలు అంతే ధీటుగా తిప్పికొడుతున్న విషయమూ విధితమే. ఈ నేపథ్యంలో బీజేపీ చీఫ్ జగత్ ప్రకాశ్ నడ్డా తాజాగా కాంగ్రెస్ వారసత్వ రాజకీయాలను లక్ష్యంగా చేసుకొని పలు వ్యాఖ్యలు చేశారు. రాజ వంశం అంటూ కాంగ్రెస్‌పై పరోక్ష విమర్శలు చేస్తూ ట్విట్టర్‌‌లో నడ్డా పలు పోస్ట్‌లు పెట్టారు.

‘ఒక రాజ వంశం గురించి ఆ వంశస్తులతోపాటు వారి నమ్మకస్తులు గొప్ప భ్రమలు కలిగి ఉన్నారు. ఆ రాజ వంశం తంత్రాలను విసిరి, వారి సభికులతో ఆ నకిలీ కథనాలను బయట పెడుతుంది. అందులో తాజాగా చెప్పుకోవాల్సింది.. ప్రతిపక్షం ప్రభుత్వాన్ని ప్రశ్నించడం. ప్రశ్నించడం అనేది ప్రతిపక్షం హక్కు. అఖిలపక్ష సమావేశంలో ఆరోగ్యకరమైన చర్చలు జరిగాయి. ఆ మీటింగ్‌లో కొందరు ప్రతిపక్ష లీడర్లు విలువైన సలహాలు ఇచ్చారు. ముందుకెళ్లే మార్గాన్ని సూచించడంలో కేంద్రానికి వారు పూర్తి మద్దతును ఇచ్చారు. కానీ అందులో నుంచి ఓ కుటుంబానికి మినహాయింపును ఇవ్వాలి. ఎవరికైనా తెలుసా వారి గురించి? తిరస్కరించిన, తొలగించబడిన రాజ వంశం.. మొత్తం ప్రతిపక్షానికి సమానం కానే కాదు. ఒక రాజ వంశపు ఆసక్తులు మొత్తం ఇండియా ప్రయోజనాలు కాదు. ఇవ్వాళ దేశం ఐక్యంగా ఉంది. సాయుధ దళాలకు ప్రజలు మద్దతుగా ఉన్నారు. ఐక్యత, సంఘీభావం కోసం ఇదే సరైన తరుణం’ అని నడ్డా చెప్పారు.