
- గండిగూడెం చెరువులో వేలాదిగా చనిపోయిన చేపలు
- లక్షల ఆదాయం కోల్పోయామని మత్స్యకారుల ఆవేదన
రామచంద్రాపురం, వెలుగు :మూడ్రోజులుగా కురుస్తున్న వానలు కెమికల్ కంపెనీలకు వరంగా మారుతున్నాయి. కెమికల్ఇండస్ర్టీస్లోని ప్రమాదకరమైన వేస్ట్ కెమికల్స్ను ట్రీట్మెంట్ ప్లాంట్లకు పంపాల్సి ఉండగా, వరద ప్రవాహంలో కలిపి స్థానికంగా ఉండే చెరువులు, కుంటల్లోకి వదులుతున్నారు. దీంతో ఆ చెరువుల్లోని వేలాది చేపలు మృత్యువాత పడ్తున్నాయి.
సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం దయారా గ్రామపంచాయతీ పరిధిలోని గండిగూడెం చెరువులో గురువారం పరిశ్రమలు వదిలిన కెమికల్స్ వల్ల వేల సంఖ్యలో చేపలు చనిపోయాయి. బొల్లారం, బొంతపల్లి ఇండస్ర్టీయల్ ఏరియాల నుంచి కెమికల్స్ వదలడం వల్లే చేపలు చనిపోయాయని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేశారు.
గతంలో కూడా ఇలాంటి సంఘటనలు జరిగినా పీసీబీ ఆఫీసర్లు గాని, స్థానిక లీడర్లుగాని పట్టించుకోవడం లేదని ఆరోపించారు. వాన పడిందంటే గొలుసు కట్టు చెరువులకు వేస్ట్ కెమికల్స్ వదులుతున్నారని, ఎన్ని ఫిర్యాదులు చేసినా చర్యలు తీసుకోవడం లేదని వాపోతున్నారు. రూ. 50 లక్షలకుపైగా ఆదాయం కోల్పోయామని తమకు న్యాయం చేసి ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నారు.