రూ. 30,791 కోట్లు ముందే చెల్లించిన జియో

రూ. 30,791 కోట్లు ముందే చెల్లించిన జియో

న్యూఢిల్లీ: టెలికం డిపార్ట్​మెంట్​కు స్పెక్ట్రమ్ ఫీజును గడువు కంటే ముందే చెల్లించేసినట్లు రిలయన్స్​ జియో ప్రకటించింది. మార్చి 2021 ముందు ఆక్షన్స్​లో కొనుగోలు చేసిన స్పెక్ట్రమ్​కు ఈ కంపెనీ రూ. 30,791 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఈ మొత్తాన్ని కట్టేసినట్లు జియో బుధవారం వెల్లడించింది. 2014, 2015, 2016, 2021 సంవత్సరాలలో ప్రభుత్వం నిర్వహించిన ఆక్షన్స్​లో స్పెక్ట్రమ్​ను కంపెనీ కొనుగోలు చేసింది. రిలయన్స్​ జియో అన్ని ఆక్షన్స్​లోనూ కలిపి 585.3 మెగా హెడ్జ్‌​ స్పెక్ట్రమ్​ను కొంది. ముందుగానే స్పెక్ట్రమ్​ ఫీజు చెల్లించేయడం వల్ల ఏటా రూ. 1,200 కోట్లు వడ్డీ రూపంలో ఆదా అవుతుందని కంపెనీ వెల్లడించింది. ఈ స్పెక్ట్రమ్​ ఫీజు చెల్లించడానికి టెలికం కంపెనీలకు ప్రభుత్వం నాలుగేళ్ల మారిటోరియం ప్రకటించిన విషయం తెలిసిందే. దేశంలోని టెలికం కంపెనీలకు ఊరట కలిగించడానికి సెప్టెంబర్​ 2021లో ఒక ప్యాకేజ్​ను ప్రభుత్వం తెచ్చింది. 2016లో కొన్న స్పెక్ట్రమ్​కి గాను మొదటి దశ ప్రీ పేమెంట్​ను రిలయన్స్​ జియో అక్టోబర్​2021లో యానివర్సరీ సందర్భంగా జరిపింది. ఆ తర్వాత డిసెంబర్​2021లో టెలికం డిపార్ట్​మెంట్​ దేశంలోని టెలికం కంపెనీలకు మరింత వెసులుబాటు ఇస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రీ పేమెంట్​ను ఏ రోజైనా చెల్లించొచ్చని అప్పుడు టెలికం డిపార్ట్​మెంట్​ తెలిపింది. దీంతో రిలయన్స్​ జియో తాను చెల్లించాల్సిన మొత్తం స్పెక్ట్రమ్​ ఫీజును ముందస్తుగానే జనవరి 2022లో  చెల్లించేసింది.  నిజానికి ఈ స్పెక్ట్రమ్​ ఫీజును  2022–23 నుంచి 2034–35 మధ్యలో ఎప్పుడయినా ఇన్​స్టాల్​మెంట్లలో చెల్లించే వెసులుబాటు రిలయన్స్​ జియోకి ఉంది.  కాకపోతే అలా చెల్లిస్తే 9.3 శాతం నుంచి 10 శాతం దాకా వడ్డీ ఖర్చును కంపెనీ భరించాల్సి వస్తుంది. కిందటి నెలలో భారతి ఎయిర్​టెల్​ కూడా టెలికం డిపార్ట్​మెంట్​కు రూ. 15,519 కోట్లను స్పెక్ట్రమ్​ ఫీజు కింద చెల్లించేసింది. 2014 ఆక్షన్‌లో కొన్న స్పెక్ట్రమ్​కు గాను ఈ చెల్లింపును భారతి ఎయిర్​టెల్​ జరిపింది. అప్పులలో కూరుకుపోయిన వోడాఫోన్​ ఐడియా, టాటా టెలి సర్వీసెస్​(టీటీఎస్‌ఎల్‌) , టాటా టెలి మహారాష్ట్ర (టీటీఎంఎల్‌) లు మాత్రం నాలుగేళ్ల మారటోరియంను కోరుకున్నాయి. అంతేకాదు, చెల్లించాల్సిన మొత్తంపై వడ్డీ  కింద ప్రభుత్వానికి తమ కంపెనీలలో వాటా ఇవ్వడానికీ ఒప్పుకున్నాయి. దీంతో ప్రభుత్వానికి వీలో 35.8 % వాటా, టీటీఎస్​ఎల్​, టీటీఎంఎల్​ కంపెనీలు రెండింటిలో  9.5 % వాటా చొప్పున దక్కాయి.

రిలయన్స్​ రిటెయిల్​ చేతికి యాడ్​వెర్బ్​ టెక్నాలజీస్
రోబోటిక్స్​ కంపెనీ యాడ్​వెర్బ్​ టెక్నాలజీస్​లో 55 శాతం వాటాను రిలయన్స్​ రిటెయిల్​ చేజిక్కించుకుంది. ఇందుకోసం రిలయన్స్​ రిటెయిల్​ రూ. 983 కోట్లను వెచ్చించింది. జియో–మార్ట్​ గ్రోసరీ బిజినెస్​ కోసం ఇప్పటికే రిలయన్స్​తో కలిసి పనిచేస్తున్నామని, ఆ కంపెనీ వేర్​హౌస్​ల ఆటోమేషన్​ కోసం సేవలు అందిస్తున్నామని యాడ్​వెర్బ్​ సీఈఓ సంగీత్​ కుమార్​ వెల్లడించారు. ఇలా కలిసి పనిచేయడంతో ఒకరిపై మరొకరికి నమ్మకం కుదిరిందని, అదే తాజా డీల్​కు దారి తీసిందని పేర్కొన్నారు.

  • ఇప్పుడు ఫిక్స్​డ్​​లైన్ బ్రాడ్​బాండ్​​ కింగ్​ జియో
  • బీఎస్​ఎన్​ఎల్​ను వెనక్కి నెట్టేసింది

ఆపరేషన్స్ ​మొదలెట్టిన రెండేళ్లలోనే ఫిక్స్​డ్​ లైన్​ బ్రాడ్​బ్యాండ్​ రంగంలో రిలయన్స్​ జియో మార్కెట్​ లీడర్​గా మారింది. గత 20 ఏళ్లుగా మొదటి ప్లేస్​లో ఉన్న బీఎస్​ఎన్​ఎల్​ను రిలయన్స్​ జియో వెనక్కి నెట్టేసింది. ట్రాయ్​ విడుదల చేసిన సబ్​స్క్రయిబర్​ డేటా ఈ విషయం వెల్లడించింది. జియోకు ప్రస్తుతం 43.4 లక్షల మంది కస్టమర్లున్నట్లు ట్రాయ్​ డేటా పేర్కొంది. అక్టోబర్​2021లో 41.6 లక్షలుగా ఉన్న జియో కస్టమర్ల సంఖ్య నవంబర్​ 2021 నాటికి 43.4 లక్షలకు చేరిందని వివరించింది. బీఎస్​ఎన్​ఎల్​కు  అక్టోబర్​2021లో 47.2 లక్షల మంది కస్టమర్లుండగా, అదే ఏడాది ​ నవంబర్​  నాటికి ఆ కస్టమర్ల సంఖ్య 42 లక్షలకు పడిపోయింది. ఇక 40.8 లక్షల మంది సబ్​స్క్రయిబర్లతో భారతి ఎయిర్​టెల్​ మూడో ప్లేస్​లో నిలిచినట్లు ట్రాయ్​ డేటా తెలిపింది. జియో తన ఫిక్స్​డ్​ లైన్​ బ్రాడ్​బ్యాండ్​ సర్వీసులను జియో ఫైబర్​ పేరుతో సెప్టెంబర్​ 2019లోనే మొదలెట్టింది. అప్పటి నుంచీ  జియో ఒక్కో కస్టమర్​నూ పెంచుకోగా, మరోవైపు అప్పటికే 86.9 లక్షల మంది బ్రాడ్​బ్యాండ్​ కస్టమర్లున్న బీఎస్​ఎన్​ఎల్​ నవంబర్​ 2021 నాటికి వారిలో సగానికి పైగా కస్టమర్లను పోగొట్టుకోవడం గమనించొచ్చు. ఇదే కాలానికి భారతి ఎయిర్​టెల్​ కూడా 70 శాతం గ్రోత్​ను సాధించింది. అంటే బీఎస్​ఎన్​ఎల్​ కస్టమర్లను ఓవైపు జియో, మరోవైపు భారతి ఎయిర్​టెల్​లు లాగేసుకున్నాయన్నమాట. దేశంలోని బ్రాడ్​బ్యాండ్​ కస్టమర్ల సంఖ్య నవంబర్​ 2021 నాటికి 80.16 కోట్లకు చేరిందని, ఇందులో 43.29 కోట్ల మందితో రిలయన్స్​ జియో టాప్​లో ఉందని కూడా ట్రాయ్​ తాజా డేటా వెల్లడించింది. భారతి ఎయిర్​టెల్​కు 21.1 కోట్లు, వీ కి 12.24 కోట్లు, బీఎస్​ఎన్​ఎల్​కు 2.36 కోట్ల కస్టమర్లున్నట్లు పేర్కొంది.