
- వేర్హౌసింగ్, లాజిస్టిక్ బిజినెస్లను మానిటైజ్ చేస్తున్న కంపెనీ
- రిటైల్ బిజినెస్లో రూ.8,278 కోట్లు ఇన్వెస్ట్ చేసిన
- ఖతర్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ
న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్ వివిధ మార్గాల్లో భారీగా ఫండ్స్ సేకరిస్తోంది. కంపెనీ సబ్సిడరీ రిలయన్స్ రిటైల్ వెంచర్స్ (ఆర్ఆర్వీఎల్) ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ (ఇన్విట్) ద్వారా రూ. 3,048 కోట్లను సేకరించనుంది. తన వేర్హౌసింగ్, లాజిస్టిక్స్ ఆస్తులపై ఇన్విట్ తీసుకురానుంది. రోడ్లు, వేర్హౌస్ వంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అసెట్లలో ఇన్విట్ ద్వారా డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేయడానికి వీలుంటుంది. ఈ ఆస్తులపై వచ్చే లాభాలను ఇన్వెస్టర్లు పంచుకుంటారు. ఇప్పటికే కంపెనీ ఆస్తులపై మూడు ఇన్విట్లు వచ్చాయి. రిటైల్ బిజినెస్కు చెందిన ఆస్తులను మానిటైజ్ చేయడానికి ఇన్విట్ తెస్తున్న కంపెనీ, ఇంటెలిజెంట్ సప్లయ్ చెయిన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్రస్ట్ను ఇందుకోసం ఏర్పాటు చేసింది.
ఈ ఇన్విట్లో 25 శాతం విలువైన యూనిట్లను మాత్రమే రిలయన్స్ రిటైల్ హోల్డ్ చేస్తుంది. మిగిలిన యూనిట్లను ఇన్వెస్టర్లకు అమ్మేస్తారు. అంటే కంపెనీ వేర్హౌసింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆస్తుల్లో రిలయన్స్ రిటైల్ ఓనర్షిప్ 25 శాతానికి తగ్గిపోతుంది. వేర్హౌసింగ్ ఆస్తులను మేనేజ్ చేయడానికి ఏర్పాటు చేసిన స్పెషల్ పర్పస్ వెహికల్ (ఎస్పీవీ) లో ఈక్విటీ షేర్లను కొనడానికి రూ.100 కోట్లు వాడతామని రిలయన్స్ రిటైల్ పేర్కొంది. మిగిలిన రూ.2,928 కోట్లను వేర్హౌసింగ్, ఇతర లాజిస్టిక్స్ ఆస్తులను కొనుగోలు చేయడానికి ఎస్పీవీకి అప్పుగా ఇస్తామని వివరించింది. అంతేకాకుండా రిలయన్స్ గ్రూప్ కంపెనీ సిక్కా పోర్ట్స్ నుంచి రూ.2,122 కోట్లను ఈ ఎస్పీవీ అప్పుగా తీసుకోనుంది. ఈ డబ్బులను కూడా వేర్హౌసింగ్ ఆస్తులను కొనుగోలు చేయడానికి వాడనుంది.
ఈ ఆస్తులే..
రిలయన్స్ తీసుకొచ్చే ఇన్విట్ పోర్టుఫోలియోలో 34 సిటీలలోని 64 వేర్హౌస్లు ఉన్నాయి. ఇందులో హైదరాబాద్, ఢిల్లీ, ఎన్సీఆర్, ముంబై, బెంగళూరు, చెన్నై, కోల్కతా, అహ్మదాబాద్, పూణె వంటి కీలకమైన వేర్హౌస్ మార్కెట్లు కూడా ఉన్నాయి. ఈ 64 వేర్హౌస్లు కూడా ఒక్కొక్కటి లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్నాయి. ఒక్కో వేర్హౌస్ కోసం కనీసం రూ.25 కోట్లను రిలయన్స్ రిటైల్ ఇన్వెస్ట్ చేసింది. త్వరలో ఈ ఇన్విట్ను ఇన్వెస్టర్ల ముందుకు రానుంది.
కాగా, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇప్పటికే గ్యాస్ పైప్లైన్స్, జియో టెలికం టవర్స్, ఫైబర్ ఆప్టిక్ కేబుల్ నెట్వర్క్స్కు సంబంధించి ఇన్విట్స్ తెచ్చింది. గ్యాస్ నెట్వర్క్ అయిన ఈస్ట్ వెస్ట్ పైప్లైన్ను రూ.13,000 కోట్లకు ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్రస్ట్ ఇన్విట్కు రిలయన్స్ ఇండస్ట్రీస్ సేల్ చేసింది. అంతేకాకుండా బ్రూక్ఫీల్డ్ నుంచే వచ్చిన టెలికం టవర్ ఇన్విట్ ద్వారా కంపెనీ రూ.25,215 కోట్లు సేకరించింది. డిజిటల్ ఫైబర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్రస్ట్లో 51 శాతం వాటాను అమ్మడం ద్వారా రూ.7,558 కోట్లను 2020 లో రిలయన్స్ సేకరించింది.
రిలయన్స్ రిటైల్లోకి భారీ పెట్టుబడి..
రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్లో ఖతర్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ (క్యూఐఏ) రూ.8,278 కోట్లను ఇన్వెస్ట్ చేసింది. కంపెనీ వాల్యుయేషన్ రూ.8.278 లక్షల కోట్ల దగ్గర ఈ పెట్టుబడులు పెట్టిందని రిలయన్స్ ఇండస్ట్రీస్ రెగ్యులేటరీ ఫైలింగ్లో పేర్కొంది. రిలయన్స్ రిటైల్ వెంచర్స్ (ఆర్ఆర్వీఎల్) దేశంలో 18,500 స్టోర్లను ఆపరేట్ చేస్తున్న విషయం తెలిసిందే. తాజా పెట్టుబడులతో ఆర్ఆర్వీఎల్లో క్యూఐఏకి 0.99 శాతం వాటా దక్కుతుంది.
క్యూఐఏకి ఉన్న అనుభవంతో ప్రయోజనం పొందాలని చూస్తున్నామని కంపెనీ డైరెక్టర్ ఈషా అంబానీ అన్నారు. కంపెనీని మరింతగా విస్తరిస్తామని చెప్పారు. కాగా, రిలయన్స్ రిటైల్లో సిల్వర్ లేక్, కేకేఆర్, అబుదాబి ఇన్వెస్ట్మెంట్ అథారిటీ, జీఐసీ, టీపీజీ, జనరల్ అట్లాంటిక్, సౌదీ అరేబియా పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ వంటి ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెట్టారు.
జియో ఫైనాన్షియల్ షేర్లు మళ్లీ డౌన్..
మార్కెట్లో లిస్టింగ్ అయినప్పటి నుంచి జియో ఫైనాన్షియల్ షేర్లు ఇన్వెస్టర్లను నిరాశకు గురి చేస్తున్నాయి. వరుసగా మూడో సెషన్ అయిన బుధవారం కూడా కంపెనీ షేర్లు 5 శాతం క్రాష్ అయ్యి లోయర్ సర్క్యూట్ను టచ్ చేశాయి. జియో ఫైనాన్షియల్ షేర్లు బుధవారం రూ.227 దగ్గర ముగిశాయి. మూడు రోజుల్లోనే రూ.23,700 కోట్లను ఇన్వెస్టర్లు నష్టపోయారు. మరోవైపు సెన్సెక్స్ నుంచి షేర్లను ఎగ్జిట్ చేయడాన్ని ఈ నెల 29 కి బీఎస్ఈ వాయిదా వేసింది. ఈ నెల 28 న రిలయన్స్ ఏజీఎం ఉన్న విషయం తెలిసిందే.