న్యూఢిల్లీ: బిలియనీర్ ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ 2024 జూన్ తరువాత గుజరాత్లో కొత్త ఎనర్జీ గిగా కాంప్లెక్స్ను మొదలు పెట్టనుంది. గుజరాత్లోని జామ్నగర్లో 5,000 ఎకరాల్లో దీనిని నిర్మిస్తోంది. కాంప్లెక్స్లో ఫోటోవోల్టాయిక్ ప్యానెల్స్, ఫ్యూయల్ సెల్ సిస్టమ్, గ్రీన్ హైడ్రోజన్, ఎనర్జీ స్టోరేజ్ పవర్ ఎలక్ట్రానిక్స్ కోసం ఐదు గిగా ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఈ సంవత్సరం దశలవారీగా వీటిని ప్రారంభించనున్నట్టు తెలిపింది.
ధీరూభాయ్ అంబానీ గ్రీన్ ఎనర్జీ గిగా కాంప్లెక్స్ ప్రపంచంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ పునరుత్పాదక ఇంధన తయారీ సౌకర్యాలలో ఒకటని రిలయన్స్ ప్రకటించింది. రూ.ఐదు లక్షల కోట్ల క్యాపెక్స్తో 100 గిగావాట్ల పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టును ఏర్పాటు చేసేందుకు గుజరాత్ ప్రభుత్వంతో రిలయన్స్ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. గ్రీన్ హైడ్రోజన్ కోసం కచ్లో 74,750 హెక్టార్ల ల్యాండ్ పార్సెల్లకు ఇది సూత్రప్రాయ ఆమోదం దక్కించుకుంది.