- 8 వరకు అరెస్ట్ చేయొద్దని పోలీసులకు కోర్టు ఆదేశం
హైదరాబాద్, వెలుగు: రంగారెడ్డి జిల్లా బుద్వేల్ లో 26 ఎకరాలను నకిలీ పత్రాలతో విక్రయించారంటూ సీసీఎస్ పోలీసులు నమోదు చేసిన కేసులో నంద్యాల టీడీపీ లోక్సభ అభ్యర్థి, మాజీ అదనపు ఎస్పీ శివానందరెడ్డి, ఆయన భార్య ఉమాదేవి, కొడుకు కనిష్కను ఈ నెల 8 వరకు అరెస్ట్ చేయరాదని పోలీసులకు హైకోర్టు మధ్యంతర ఆదేశాలిచ్చింది. అయితే, కేసు దర్యాప్తును కొనసాగించవచ్చని స్పష్టం చేసింది.
నిందితులకు సీఆర్పీసీ సెక్షన్ 41ఎ సెక్షన్ ప్రకారం నోటీసులు జారీ చేసి విచారణ చేయవచ్చునని తెలిపింది. ఈ మేరకు జస్టిస్ బి.విజయ్సేన్రెడ్డి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. భూఆక్రమణల అభియోగాలపై 2022లో నమోదైన మూడు కేసుల్లో పోలీసులు హైదరాబాద్ లోని శివానందరెడ్డి ఇంటికి వెళ్లి ఆయన భార్య, కొడుకులను అదుపులోకి తీసుకున్నారు. దీనిని వారిద్దరూ సవాల్ చేసిన పిటిషన్లపై కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది.