టీచర్ రిక్రూట్‌‌మెంట్ స్కామ్..దీదీ సర్కారుకు ఊరట

టీచర్ రిక్రూట్‌‌మెంట్ స్కామ్..దీదీ సర్కారుకు ఊరట

న్యూఢిల్లీ: టీచర్ రిక్రూట్‌‌మెంట్ స్కామ్ లో మమతా బెనర్జీ ప్రభుత్వానికి ఊరట లభించింది. ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వ అధికారుల పాత్రపై దర్యాప్తు చేయాలంటూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. 2016 నాటి స్టేట్ లెవల్ సెలక్షన్ టెస్ట్ నియామక ప్రక్రియ చెల్లదని కలకత్తా హైకోర్టు ఇటీవల స్పష్టంచేసింది. ఆ పరీక్షతో జరిపిన నియామకాలను రద్దు చేస్తున్నట్లు తెలిపింది. అంతేగాక, ఉద్యోగాలు సాధించిన టీచర్లు తమ జీతాన్ని వడ్డీతో సహా తిరిగి ఇచ్చేయాలని వెల్లడించింది.

 ఈ స్కామ్ పై సమగ్ర దర్యాప్తు జరిపి మూడు నెలల్లోగా నివేదిక సమర్పించాలని సీబీఐకి ఆదేశాలు జారీ చేసింది. కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ మమత బెనర్జీ సర్కార్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కోర్టు ఏకపక్షంగా ఆ నియామకాలను రద్దు చేసిందని తన పిటిషన్ లో  పేర్కొంది. ఈ పిటిషన్ ను చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాతో కూడిన బెంచ్ సోమవారం విచారించింది.

 వాదనల అనంతరం..రాష్ట్ర ప్రభుత్వంలోని అధికారులపై సీబీఐ దర్యాప్తునకు ఇచ్చిన ఆదేశాలపై స్టే విధిస్తున్నట్లు ప్రకటించింది. 2016లో బెంగాల్ సర్కారు 24,650 టీచర్లు, నాన్ టీచింగ్ స్టాఫ్  ఖాళీల భర్తీ కోసం రిక్రూట్మెంట్ చేపట్టింది. 25,753 మందికి అపాయింట్మెంట్ లెటర్లు అందజేసింది. ఈ నియామక ప్రక్రియలో అవకతవకలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. దీనిపై దర్యాప్తు చేపట్టాలని పిటిషన్లు దాఖలయ్యాయి.