
- పార్టీ ప్రధాన కార్యదర్శులు సోమ భరత్, రవీందర్రావు పేరిట ప్రకటన
- పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని వేటు
- ఆమె వ్యాఖ్యలతో పార్టీకి తీరని నష్టం జరుగుతున్నందువల్లే కేసీఆర్
- ఈ నిర్ణయం తీసుకున్నారని వెల్లడి
- రాష్ట్రవ్యాప్తంగా పార్టీ ఆఫీసుల్లో కవిత ఫ్లెక్సీలు, ఫొటోల తొలగింపు
- సోషల్ మీడియాలోనూ ఆమెకు వ్యతిరేకంగా పోస్టులు
- షోకాజ్ లేకుండానే సస్పెండ్ చేశారంటూ జాగృతి నేతల మండిపాటు
- ఎమ్మెల్సీ పదవికి కవిత రాజీనామా చేసే చాన్స్
- కొత్త పార్టీ ఏర్పాటుపై సమాలోచనలు
హైదరాబాద్, వెలుగు: కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవితపై బీఆర్ఎస్ సస్పెన్షన్ వేటు వేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలను తీవ్రంగా పరిగణిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈ మేరకు బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శులు సోమ భరత్కుమార్, టి.రవీందర్ రావు పేరిట మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ‘‘పార్టీ ఎమ్మెల్సీ కవిత ఇటీవలి కాలంలో ప్రవర్తిస్తున్న తీరు తెన్నులు, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు బీఆర్ఎస్ పార్టీకి నష్టం కలిగించేలా ఉన్నాయి. ఈ విషయాన్ని పార్టీ అధిష్టానం తీవ్రంగా పరిగణిస్తున్నది.
కవితను తక్షణం పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు’’ అని ఆదేశాల్లో పేర్కొన్నారు. కాగా, కవితపై పార్టీ సస్పెన్షన్ వేటు ఇలా వేసిందో లేదో.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఆఫీసుల్లో కవిత ఫ్లెక్సీలు, ఫొటోలను పార్టీ నేతలు తొలగించారు. సిద్దిపేటలో హరీశ్ రావు అభిమానులు, ఆయన అనుచరులు.. కవిత దిష్టిబొమ్మను దహనం చేశారు. ఇటు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేతలూ కవితపై సస్పెన్షన్ వేటును సమర్థిస్తూ కామెంట్లు చేశారు. కవితపై బీఆర్ఎస్ అసెంబ్లీ విప్ కేపీ వివేకానంద, పల్లా రాజేశ్వర్రెడ్డి, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ తీవ్రంగా స్పందించారు. పార్టీ లైన్ దాటితే కన్న కూతురైనా చర్యలు తప్పవంటూ పేర్కొన్నారు. మరోవైపు ఎర్రవల్లి ఫాంహౌస్లో కేసీఆర్తో కేటీఆర్, జగదీశ్రెడ్డి, వేముల ప్రశాంత్రెడ్డి, బి. వినోద్కుమార్ సమావేశమయ్యారు. బీఆర్ఎస్ సోషల్ మీడియాలోనూ ఆమెపై విమర్శలను తీవ్రతరం చేశారు. కల్వకుంట్ల కాదు.. దేవనపల్లి కవిత అంటూ కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు.
షోకాజ్ నోటీసు లేకుండానే..
అమెరికా నుంచి వచ్చిన కవిత సోమవారం హరీశ్రావు, సంతోష్ రావు పేర్లను తీసుకొని, నేరుగా ఎటాక్ చేశారు. అవినీతి అనకొండలంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. దీంతో కవితపై పార్టీ సస్పెన్షన్ వేటు వేసింది. వాస్తవానికి ఆమె చేసిన వ్యాఖ్యలకు షోకాజ్ నోటీసు ఇస్తారని పార్టీ వర్గాలు భావించాయి. కానీ, నేరుగా పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో జాగృతి నేతలు షాక్ అయ్యారు. కనీసం షోకాజ్ ఇవ్వకుండా పార్టీ నుంచి ఎలా సస్పెండ్ చేస్తారని ప్రశ్నించారు. ఇటు కవిత తదుపరి నిర్ణయం ఎలా ఉండబోతుందన్నది ఆసక్తికరంగా మారింది. పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో.. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయడంతోపాటు.. ఆమె తన ఎమ్మెల్సీ పదవికీ రాజీనామా చేస్తారన్న చర్చ జరుగుతున్నది. బుధవారం నేరుగా ఆమె మండలి చైర్మన్కు రాజీనామా లేఖను సమర్పించే యోచనలో ఉన్నట్టు తెలుస్తున్నది. ప్రస్తుతం కవిత నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఉండగా.. 2028 జనవరి వరకు పదవీ కాలం ఉన్నది. మరోవైపు బుధవారం తన సస్పెన్షన్పై కవిత స్పందించనున్నట్టు తెలిసింది. సొంతంగా పార్టీ ఏర్పాటు చేసుకునే యోచనలోనూ కవిత ఉన్నట్టు చెబుతున్నారు. టీఆర్ఎస్ అని వచ్చేలా పార్టీని ఏర్పాటు చేసే అవకాశాలున్నాయంటున్నారు. ఒకవేళ పార్టీ కాకుంటే జాగృతినే మరింత బలోపేతం చేసి, పనిచేయాలన్న మరో యోచన కూడా ఉన్నట్టు చెబుతున్నారు.
క్రమంగా సొంత సైన్యం..
పార్టీలో ప్రాధాన్యం లేకపోవడంతో కవిత సొంత సైన్యాన్ని ఏర్పాటు చేసుకునే దిశగా అడుగులు వేశారు. తెలంగాణ జాగృతిని బలోపేతం చేసుకుంటూ 30 అనుబంధ విభాగాలు ఏర్పాటు చేశారు. సింగరేణి జాగృతి విభాగాన్ని ప్రకటించారు. అయితే, ఈ క్రమంలోనే సింగరేణి ఇన్చార్జ్గా కొప్పుల ఈశ్వర్ను జులై 16న కేటీఆర్ ప్రకటించారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల క్రమంలో సింగరేణిలో ఆమె హిందూ మజ్దూర్ సభతో జట్టుకట్టారు. దీంతో ఆగస్టు 21ను ఆమెను తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) గౌరవాధ్యక్షురాలిగా తప్పించారు. ఆమె స్థానంలో కొప్పుల ఈశ్వర్ను నియమించారు. జూన్ 1న జాగృతికి అనుబంధంగా యునైటెడ్ ఫూలే ఫ్రంట్ (యూపీఎఫ్) పనిచేస్తుందని కవిత ప్రకటించారు. అప్పటి నుంచి పార్టీ తరఫున కాకుండా యూపీఎఫ్ ద్వారానే బీసీ రిజర్వేషన్లపై ఆమె స్పందిస్తూ వస్తున్నారు. ఆగస్టు 3న బీఆర్ఎస్ సీనియర్ నేత, ఎమ్మెల్యే జగదీశ్రెడ్డిపై ఆమె మండిపడ్డారు. లిల్లీపుట్అని వ్యాఖ్యా నించారు. ఆ తర్వాత రాఖీ పండుగ రోజు తన అన్న కేటీఆర్కు రాఖీ కడతానంటూ కవిత మెసేజ్ పెట్టారు. ఆగస్టు 9న మెసేజ్ పెట్టినా.. కేటీఆర్ నుంచి స్పందన రాలేదు. ఆ తర్వాత కేటీఆర్ బెంగళూరు వెళ్లి అక్కడి నుంచి కవితకు రిప్లై ఇచ్చారన్న విమర్శలున్నాయి. దీంతోనే అన్నా చెల్లెళ్ల మధ్య దూరం పెరిగిందన్న చర్చ కూడా జరిగింది.
లేఖ లీక్ దగ్గరే మొదలు..
ఈ మొత్తం ఎపిసోడ్ కవిత తన తండ్రికి రాసిన లేఖ దగ్గరే మొదలైంది. ఏప్రిల్ 27న వరంగల్లోని ఎల్కతుర్తిలో నిర్వహించిన పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకల్లో కేసీఆర్ ప్రసంగంపై.. మే 2న కవిత లేఖ రాశారు. ప్రసంగంలో ఎక్కడా బీజేపీని ఎందుకు టార్గెట్ చేయలేదని కేసీఆర్ను ప్రశ్నించారు. పార్టీ కేడర్కు టైం కూడా ఇవ్వలేదంటూ ఆ లేఖలో ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, కవిత అమెరికా పర్యటనలో ఉన్నప్పుడు.. మే 22న ఆ లేఖ లీక్ అయింది. కేసీఆర్కు అత్యంత సన్నిహితంగా ఉన్న పార్టీ లీడర్లే ఆ లేఖను లీక్ చేశారన్న వార్తలు వచ్చాయి. లేఖ లీక్ అయిన మర్నాడే మే 23న కవిత అమెరికా నుంచి ఇండియాకు వచ్చారు. వచ్చీరాగానే శంషాబాద్ ఎయిర్పోర్టులో పెద్దబాంబే పేల్చారు. కేసీఆర్ చుట్టూ దెయ్యాలున్నాయంటూ ఫైర్ అయ్యారు. తన తండ్రికి రాసిన లేఖను ఆ దెయ్యాలే లీక్ చేశాయన్నారు. పార్టీలోని కోవర్టులను పక్కనపెడితేనే పార్టీకి మనుగడ అని వ్యాఖ్యానించారు.
చిట్చాట్తో మరింత హీట్
ఎయిర్పోర్టులో చేసిన వ్యాఖ్యలే అనుకుంటే.. ఆ తర్వాత మే 29న కవిత మీడియా చిట్చాట్లో సంచలన విషయాలను వెల్లడించారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనానికి కుట్రలు జరిగాయంటూ ఆటం బాంబును పేల్చారు. అంతేకాదు.. ఇంటి ఆడబిడ్డనని కూడా చూడకుండా తనపైనే కుట్రలకు పాల్పడ్డారంటూ ఆరోజు కేటీఆర్, హరీశ్రావుపై పరోక్షంగా ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తనను పార్టీ నుంచి బయటకు పంపే దమ్ము ఎవరికీ లేదంటూ గట్టిగానే చెప్పుకొచ్చారు. ‘‘ఇది నా పార్టీ. నాకూ హక్కు ఉంది. నా నాయకుడు కేసీఆర్. ఆయన నాయకత్వంలోనే పనిచేస్తా. ఇతరుల నాయకత్వంలో నేను పనిచేయను’’ అని చిట్చాట్లో స్పష్టంగా చెప్పారు. అయితే, అంతకుముందే కవితకు సర్దిచెప్పేందుకు కేసీఆర్.. తనకు అత్యంత సన్నిహితులైన దీవకొండ దామోదర్రావు, గండ్ర మోహన్రావును మే 27న కవిత వద్దకు పంపినా.. ప్రయోజనం లేకుండా పోయింది. ఆ రాయబారం తర్వాతే ఆమె చిట్చాట్లో సంచలన వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఆ తర్వాత కవిత ఎపిసోడ్పై పార్టీ నేతలెవరూ మాట్లాడవద్దంటూ కేసీఆర్ సూచనలు చేశారు. దీంతో ఆమె ఎన్నిసార్లు ఆరోపణలు చేసినా.. ఎవరూ మాట్లాడలేదు. కేసీఆర్ కూడా కవితను పిలిపించుకొని ఈ విషయాలపై చర్చించలేదు. తన మనుషులను పంపించి సర్దిచెప్పేందుకు ప్రయత్నించినా ఆమె మాట వినలేదన్న కోపమూ కేసీఆర్కు ఉందన్న వాదనలు పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి.