- రెండు నెలల్లో రిపోర్టు ఇవ్వాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఎన్ హెచ్ఆర్సీ ఆదేశం
న్యూఢిల్లీ: కాళేశ్వరం ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ ముంపుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు జాతీయ మానవ హక్కుల కమిషన్(ఎన్ హెచ్ఆర్ సీ) నోటీసులు జారీ చేసింది. ముంపు ప్రభావంపై స్టడీ చేసి 8 వారాల్లోగా రిపోర్ట్ ఇయ్యాలని ఆదేశించింది. కాళేశ్వరం బ్యాక్ వాటర్ తో పంటలు నష్టపోతున్న రైతులకు పరిహారం చెల్లింపుతో పాటు పునరావాసం కల్పించాలని కోరుతూ సుప్రీంకోర్టు అడ్వకేట్ కె.శ్రావణ్కుమార్నవంబర్ 30న ఎన్హెచ్ఆర్సీలో పిటిషన్ వేశారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల బ్యాక్ వాటర్తో మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో ఏటా 60 వేల నుంచి 80 వేల ఎకరాల్లో పంటలు నీటమునుగుతున్నాయని పిటిషన్లో పేర్కొన్నారు. మూడేండ్లుగా సుమారు30 వేల మంది రైతులు, కౌలు రైతులు పంటలు నష్టపోతున్నారని తెలిపారు. మంచిర్యాల జిల్లా చెన్నూర్కు చెందిన కమ్ముల రాజేశ్(28) అనే యువరైతు పంటనష్టంతో మనస్తాపం చెంది సెప్టెంబర్ 23న స్థానిక చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న ఉదంతాన్ని ఎన్ హెచ్ఆర్సీ దృష్టికి తీసుకెళ్లారు.
‘వీ6 వెలుగు’ దిన పత్రికతో పాటూ ఇతర పత్రికల్లో వచ్చిన ముంపు సమస్య కథనాలను శ్రావణ్ ఎన్ హెచ్ఆర్ సీకి ఇచ్చిన ఫిర్యాదు కాపీకి జత చేశారు. కేసు విచారించిన కమిషన్కాళేశ్వరం బ్యాక్వాటర్ముంపు, రైతులకు జరుగుతున్న నష్టంపై అధ్యయనం చేసి 8 వారాల్లోగా రిపోర్టు ఇవ్వాలని కేంద్ర అటవీ, పర్యావరణ శాఖలను, తెలంగాణ ప్రభుత్వ చీఫ్ సెక్రటరీకి నోటీసులు జారీ చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో ఎన్జీటీ ఆర్డర్స్ను ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించింది. కాగా, ఇదే అంశంపై గతంలో బీజేపీ జాతీయ కార్యదర్శి, పెద్దపల్లి మాజీ ఎంపీవివేక్ వెంకటస్వామి గవర్నర్ తమిళి సైకి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
న్యాయం జరిగేనా...?
కాళేశ్వరం ప్రాజెక్టు మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల రైతాంగానికి శాపంగా మారింది. మూడేండ్లుగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల బ్యాక్ వాటర్తో గోదావరి ఒడ్డుపొంట వేలాది ఎకరాల్లో వరి, పత్తి పంటలు మునిగిపోతున్నాయి. మంచిర్యాల జిల్లా చెన్నూర్ నియోజకవర్గంలోనే దాదాపు 30 వేల ఎకరాల్లో పంటలు నీటిపాలవుతున్నాయి. ముంపుతో నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.50 వేల పరిహారం ఇవ్వాలని, ముంపు భూములను ప్రభుత్వమే తీసుకొని ఎకరాకు రూ.20 లక్షలు చెల్లించాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. రైతులను ఆదుకోవాలని కోరుతూ ఆ పార్టీ జాతీయ కార్యదర్శి వివేక్ ఆధ్వర్యంలో రెండేండ్లుగా పోరాడుతున్నా సర్కారు పట్టించుకోవడం లేదు. సీఎం కేసీఆర్కమీషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారని, ఇందులో రూ.50 వేల కోట్ల అవినీతి జరిగిందని ఆయన ఆరోపిస్తున్నారు. కాళేశ్వరం ముంపు సమస్యపై ఎన్ హెచ్ఆర్సీ కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలకు నోటీసులివ్వడంతో ఇకనైనా రైతులకు న్యాయం జరుగుతుందా అనే చర్చ మొదలైంది.
రైతుల ఆత్మహత్యలు..
కాళేశ్వరం బ్యాక్వాటర్లో పంటలు మునగడంతో రెండేడ్లలో మంచిర్యాల జిల్లాలో ఇద్దరు కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. నిరుడు కోటపల్లి మండలం పుల్లగామకు చెందిన కామ లింగయ్య(60) పదెకరాలు కౌలు పట్టి పత్తి వేశాడు. ఆగస్టు నెలాఖరులో గోదావరికి వరద పోటెత్తింది. మేడిగడ్డ బ్యారేజీ బ్యాక్వాటర్వల్ల ప్రాణహిత ఒడ్డు పొంట10 వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. అప్పులపాలైన లింగయ్య నిరుడు సెప్టెంబర్ 21న పురుగులమందు తాగి ప్రాణం తీసుకున్నాడు. బాధిత కుటుంబానికి ఎక్స్గ్రేషియా ఇస్తామని చెన్నూర్ఎమ్మెల్యే బాల్క సుమన్ ప్రకటించినా ఇప్పటికీ ఆ ఊసేలేదు. ఈ ఏడాది చెన్నూర్ జెండావాడకు చెందిన కమ్ముల రాజేష్(28) బతుకమ్మ వాగు దగ్గర్లో ఆరెకరాలు కౌలుకు తీసుకుని పత్తి పెట్టాడు. జులై నెలాఖరులో అన్నారం బ్యారేజీ వాటర్లో పంట మునిగింది. దాన్ని చెడగొట్టి మళ్లా పత్తి, మిర్చి వేయగా, సెప్టెంబర్ మొదటివారంలో మరోసారి బ్యాక్ వాటర్ ముంచెత్తింది. పెట్టుబడులకు చేసిన రూ.5 లక్షల అప్పు మీదపడటంతో మనస్తాపం చెంది సెప్టెంబర్23న చెన్నూర్ పెద్ద చెరువులో దూకి చనిపోయాడు. ఎమ్మెల్యే బాల్క సుమన్ కంటితుడుపు చర్యగా రూ.2 లక్షలు అందించి చేతులు దులుపుకున్నాడు తప్ప ప్రభుత్వం నుంచి ఎక్స్గ్రేషియా ఇప్పించలేకపోయాడు.