ధైర్యే.. సాహసే.. సైదా సుల్తానా..!

ధైర్యే.. సాహసే.. సైదా సుల్తానా..!

చోరీకి వచ్చి దాడి చేసిన దొంగలు
ప్రతిఘటించిన మహిళ.. పారిపోయిన చోరులు

చేవెళ్ళ, వెలుగు:  ఒంటరి మహిళపై ముగ్గురు దొంగలు దాడి చేసి గాయపరిచిన సంఘటన గురువారం అర్ధరాత్రి మొయినాబాద్​మండలం పెద్దమంగళారం గ్రామం పరిధిలో  చోటు చేసుకుంది. సర్కిల్ ఇన్​స్పెక్టర్​వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దమంగళారం గ్రామానికి సమీపంలోని సిరిమల్లె వెంచర్ లో  సిటీకి చెందిన సైదా సుల్తానా మూడు నెలల కిందట ఇల్లు కొనుగోలు చేసింది. ఇద్దరు కొడుకులు, కోడళ్లతో ఉంటోంది. గురువారం ఒక కుమారుడు జాబ్‌కు వెళ్లగా, మరో కుమారుడు, ఇద్దరు కోడళ్లు ఊరికి వెళ్ళారు. రాత్రి ఆమె ఒంటరిగా ఉండగా ముగ్గురు దొంగలు రాత్రి 11 గంటలకు   గోడ దూకి లోపలికి వచ్చారు. గేటు చప్పుడు కావడంతో ఆమె ఇంట్లోకి వెళ్లి  గడియ పెట్టుకుంది. వారు ప్రహారి వద్ద దాగి ఉండగా వెళ్లిపోయారనుకున్న అరగంట తర్వాత ఆమె బయటకు వచ్చింది.

దాంతో వారు  ఒక్కసారిగా ఆమెపై దాడికి యత్నించగా ఆమె  తిరగబడింది. వారిలో ఒకడు కుర్చీతో కొట్టగా ఆమెకు గాయాలు అయ్యాయి. కేకలు వేయడంతో దొంగలు  పారిపోయారు. కొద్ది సేపటికి స్పృహలోకి వచ్చి 100 డయల్ చేసి సమాచారం ఇచ్చింది. స్థానిక పోలీసులకు సమాచారం వెళ్లడంతో   అక్కడికి వెళ్లారు. బాధితురాలి ఫిర్యాదుతో శంషాబాద్​ డీసీపీ ప్రకాష్​రెడ్డి ఆధ్వర్యంలో మొయినాబాద్ సీఐ వెంకటేశ్వర్లు కేసు నమోదు చేశారు. నిందితులు అదే గ్రామానికి చెందినవారుగా గుర్తించి వారిని అదుపులోకి తీసుకుని విచా రిస్తున్నట్లు సమాచారం.