హైదరాబాద్, వెలుగు: రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పీఎస్ కృష్ణన్(89) కన్నుమూశారు. అనారోగ్యంతో కొంతకాలంగా ఢిల్లీ అపోలో ఆస్పత్రిలో ట్రీట్మెంట్ పొందుతున్న ఆయన ఆదివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. కృష్ణన్కు భార్య శాంతికృష్ణన్, కుమార్తె శుభాకృష్ణన్ ఉన్నారు. ఢిల్లీ లోథి రోడ్డులోని ఎలక్ట్రానిక్ శ్మశాన వాటికలో ఆయన అంత్యక్రియలు నిర్వహించారు. సామాజిక న్యాయం కోసం తుది వరకూ పోరాడిన కృష్ణన్ పుట్టింది కేరళలో. 1956 బ్యాచ్ ఆంధ్రప్రదేశ్ కేడర్ ఐఏఎస్ అధికారి. ఎస్సీ, ఎస్టీ, వెనుకబడిన తరగతుల సంక్షేమం కోసం ఎంతో కృషి చేశారు. మండల్ కమిషన్ సిఫార్సులు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం–1989 రూపకల్పన, ఏపీలో ముస్లిం రిజర్వేషన్ల రూపకల్పనలో కృష్ణన్ కీలక పాత్ర పోషించారు. కేంద్ర, రాష్ట్ర సర్వీసుల్లో వివిధ హోదాల్లో పనిచేశారు. కేంద్ర సంక్షేమ శాఖ కార్యదర్శిగా, జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యుడిగా, బీసీ కమిషన్ సభ్య కార్యదర్శిగా, ప్లానింగ్ కమిషన్లోని వివిధ విభాగాల్లో చైర్మన్, మెంబర్గా బాధ్యతలు నిర్వర్తించారు. కేంద్ర ప్రభుత్వ గౌరవ సలహాదారుగా, ఢిల్లీలోని ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్గా బాధ్యతలు నిర్వర్తించారు. ‘సోషల్ ఎక్స్క్లూసన్ అండ్ జస్టిస్ ఇన్ ఇండియా, ఎంపవరింగ్ దళిత్స్ ఫర్ ఎంపవరింగ్ ఇండియా, ఎ క్రూసేడ్ ఫర్ సోషల్ జస్టిస్’వంటి పుస్తకాలు రాసి తన రచనలతోనూ జనంలో చైతన్యం కలిగించారు.
సంక్షేమ విధానాల్లో కృష్ణన్ కృషి ఎనలేనిది: కేసీఆర్
రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పీఎస్ కృష్ణన్ మృతికి సీఎం కేసీఆర్ సంతాపం ప్రకటించారు. సామాజిక సంక్షేమ విధానాల రూపకల్పనలో కృష్ణన్ ఎనలేని కృషి చేశారని కొనియాడారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. పీఎస్ కృష్ణన్ మరణం పట్ల ఎంసీఆర్హెచ్ఆర్డీ డీజీ, ఐఏఎస్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బీపీ ఆచార్య కూడా సంతాపం వ్యక్తం చేశారు. వీపీ సింగ్ ప్రధానిగా పని చేసిన సమయంలో మండల్ కమిషన్ ఏర్పాటులో కృష్ణన్ కీలకంగా వ్యవహరించారు. ఉమ్మడి ఏపీలో ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించడంలోనూ ఆయన ప్రముఖ పాత్ర పోషించారు. అట్టడుగు వర్గాల కోసం అనేక సంక్షేమ పథకాలు రూపొందించిన అధికారిగా గుర్తింపు పొందారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ కూడా కృష్ణన్ మృతికి సంతాపం తెలిపారు.

