
- జడ్జిలు అలా చేస్తే న్యాయవ్యవస్థపై జనంలో అపోహలు: సీజేఐ జస్టిస్ గవాయ్
- భవిష్యత్ ప్రయోజనాలు ఆశించారన్న అపవాదు వస్తుంది
- న్యాయ వ్యవస్థపై ప్రజలకు నమ్మకం పోతుందని కామెంట్
లండన్: పదవీ విరమణ తర్వాత జడ్జిలు ప్రభుత్వ పదవులు చేపట్టడంపై భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ బీఆర్ గవాయ్ ఆందోళన వ్యక్తం చేశారు. రిటైర్ అయిన వెంటనే ఎన్నికల్లో పోటీ చేయడం కారణంగా నైతిక విలువలు దెబ్బతింటాయన్నారు. పదవుల కోసం చేసే ఇటువంటి ప్రయత్నాలు ప్రజల్లో న్యాయవ్యవస్థపై నమ్మకాన్ని దెబ్బతీస్తాయని హెచ్చరించారు.
‘‘ఒక న్యాయమూర్తి రిటైర్మెంట్ తీస్కున్న వెంటనే ప్రభుత్వ పదవిలో చేరితే.. లేదా ఎన్నికల్లో పోటీ చేసేందుకు జడ్జి పదవి నుంచి తప్పుకుంటే.. అవి న్యాయవ్యవస్థపై సందేహాలను రేకెత్తిస్తాయి. భవిష్యత్ ప్రయోజనాలను ఆశించి తీర్పులు ఇచ్చారనే అభిప్రాయం ప్రజల్లో ఏర్పడవచ్చు. రాజకీయ ప్రమేయంతో న్యాయమూర్తులు చెప్పే తీర్పులు కూడా ప్రభావితమవుతాయనే భావన ప్రజల్లో కలగొచ్చు”అని సీజేఐ అన్నారు. మంగళవారం యునైటెడ్ కింగ్డమ్ సుప్రీంకోర్టులో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ‘న్యాయవ్యవస్థ– స్వాతంత్రం’ అనే అంశంపై ఆయన ప్రసంగించారు.
పదవుల కోసం జడ్జిలు తీసుకునే నిర్ణయాలు న్యాయవ్యవస్థ సమగ్రతనే దెబ్బతీస్తాయని అన్నారు. ప్రజాస్వామ్యంలో న్యాయవ్యవస్థ కేవలం న్యాయం చెప్పడమే కాకుండా, అధికారాన్ని ప్రశ్నించే నమ్మకమైన సంస్థగా ప్రజలకు కనిపించాలన్నారు. తాను, తన సహచరులు చాలామంది.. తమ పదవీ విరమణ తర్వాత ఎటువంటి పదవులను అంగీకరంచబోమని బహిరంగంగా ప్రతిజ్ఞ చేశామని సీజేఐ గుర్తుచేశారు. ఇది న్యాయవ్యవస్థ విశ్వసనీయత, స్వాతంత్ర్యాన్ని కాపాడేందుకు చేసిన ప్రయత్నమని చెప్పారు.