
- నంబాల కేశవరావును దుర్మార్గంగా చంపారు
బషీర్బాగ్, వెలుగు: అసమానతలు, అణచివేత పెరిగితే ప్రజల నుంచి తిరుగుబాటు తప్పదని హైకోర్టు రిటైర్డ్జస్టిస్ బి.చంద్రకుమార్ చెప్పారు. తిరుగుబాటును ఏ శక్తులూ అడ్డుకోలేవన్నారు. ఆపరేషన్కగార్ను ఆపాలి.. సీజ్ ఫైర్ప్రకటించి మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని డిమాండ్ చేస్తూ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో గురువారం తెలంగాణ రాష్ట్ర ప్రజాస్వామిక వేదిక(టీఎస్ డీఎఫ్) ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ ఆశయం, లక్ష్యంతో పోరాటం చేస్తున్న మావోయిస్టు అధినేత నంబాల కేశవరావును పోలీసులు దుర్మారంగా చంపారని ఆరోపించారు.
మావోయిస్టుల మృతదేహాలను వారి కుటుంబాలకు అప్పగించకుండా పోలీసులే ఖననం చేయడం, మృతదేహాల వద్ద సంబురాలు చేసుకోవడం హిందూ ధర్మానికి పూర్తిగా విరుద్ధమన్నారు. దోపిడీ, నిరుద్యోగం, రైతుల ఆత్మహత్యలు, మహిళలపై హింస, బాల కార్మిక వ్యవస్థ, ఆర్థిక అసమానతలు కొనసాగినంత కాలం ప్రజా ఉద్యమాలు, పోరాటాలు సజీవంగానే ఉంటాయని స్పష్టం చేశారు.
నంబాల కేశవరావు, కెన్యా దేశ కవి గూగిఈ దీయంగ్ మృతికి సంతాపం తెలియజేస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించారు. సదస్సులో వామ పక్ష పార్టీలు, ప్రజా సంఘాలు, హక్కుల సంఘాల నేతలు వి.ఎస్.బోస్, విమలక్క, డా.దిడ్డి సుదాకర్, నారాయణరావు, అంబటి నాగయ్య, ప్రసాద్, కృష్ణప్రసాద్, విశ్వనాదం, వనం సుధాకర్, జానకి రాములు పాల్గొనిమాట్లాడారు.