ముంబై : అప్పులు తిరిగి చెల్లించిన తర్వాత బారోవర్లకు వారి ప్రాపర్టీ డాక్యుమెంట్లు వెనక్కి ఇవ్వడంలో లేట్ చేస్తే బ్యాంకులపై రోజుకి రూ. 5 వేల చొప్పున పెనాల్టీ విధించనున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆదేశాలు జారీ చేసింది. అప్పు కట్టేశాక డాక్యుమెంట్ల కోసం బ్యాంకుల చుట్టూ తిరగాల్సి వస్తోందని బారోవర్లు బ్యాంకులపై ఫిర్యాదులు చేయడంతో ఆర్బీఐ యాక్షన్కి దిగుతోంది. అప్పు మొత్తం తిరిగొచ్చాక బారోవర్లకు చెందిన మూవబుల్ లేదా ఇమ్మూవబుల్ ప్రాపర్టీల డాక్యుమెంట్లను వెంటనే రిలీజ్ చేయమని చెబుతూ బుధవారం ఆర్బీఐ ఆదేశాలు ఇష్యూ చేసింది.
బారోవర్లకు ప్రయోజనం..
లోన్లు చెల్లించేశాక వెంటనే ప్రాపర్టీ డాక్యుమెంట్లను బ్యాంకులు వెనక్కి ఇవ్వాలనే ఆర్బీఐ ఆదేశాల వల్ల బారోవర్లకు ఉపశమనం కలుగుతుందని ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్, స్టేబుల్ ఇన్వెస్టర్ ఫౌండర్ దేవ్ ఆశిష్ చెప్పారు. అప్పులు తిరిగి చెల్లించాక కూడా డాక్యుమెంట్లను అందుకోవడానికి బ్యాంకుల చుట్టూ బారోవర్లు కాళ్లు అరిగేలా తిరగాల్సి రావడం అన్యాయమని పేర్కొన్నారు.
అన్ని బ్యాంకులకూ ఇదే రూల్..
దేశంలోని అన్ని బ్యాంకులకు అంటే, కమర్షియల్ బ్యాంకులు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు, రీజినల్ రూరల్ బ్యాంకులు, ప్రైమరీ అర్బన్ కో–ఆపరేటివ్ బ్యాంకులు, స్టేట్ కో–ఆపరేటివ్ బ్యాంకులు, డిస్ట్రిక్ట్ సెంట్రల్ కో–ఆపరేటివ్ బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు, అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీలకూ ఈ రూల్ వర్తిస్తుందని ఆర్బీఐ స్పష్టం చేసింది. ఈ ఏడాది డిసెంబర్ 1 నుంచి కొత్త రూల్ అమలులోకి వస్తుందని వెల్లడించింది.
30 రోజుల్లోనే ఒరిజినల్ డాక్యుమెంట్లు వెనక్కి ఇవ్వాలి..
బారోవర్లు అప్పులు తిరిగి చెల్లించేసిన 30 రోజులలోపు తనఖా తొలగించి, ఒరిజినల్ ప్రాపర్టీ డాక్యుమెంట్లను బ్యాంకులు లేదా ఎన్బీఎఫ్సీలు వెనక్కి ఇవ్వాలని ఆర్బీఐ ఆదేశించింది. లోన్క్లోజర్ అంశంపై బారోవర్లు చాలా మంది దృష్టి పెట్టరని డిజిటల్ లెండింగ్ కన్సల్టెంట్ పారిజాత్ గర్గ్ చెప్పారు. ఆర్బీఐ తాజా ఆదేశాలతో ఇప్పుడు అందరూ దీనిపై ఫోకస్ పెడతారని పేర్కొన్నారు. డిసెంబర్ 1 తర్వాత వెనక్కి ఇవ్వాల్సిన ప్రాపర్టీ డాక్యుమెంట్లన్నింటికీ ఈ కొత్త రూల్ వర్తించనుంది.
ALSO READ: సమస్యలపై పట్టింపేది..? వాడీవేడిగా జడ్పీ జనరల్బాడీ మీటింగ్
డాక్యుమెంట్లు ఎక్కడి నుంచి వెనక్కి తీసుకోవాలి..
అప్పు ఇచ్చిన బ్యాంక్ బ్రాంచీ నుంచి ఒరిజినల్ ప్రాపర్టీ డాక్యుమెంట్లను బారోవర్లు వెనక్కి తీసుకోవచ్చు. లేదంటే, ఆ బ్యాంకుకు సంబంధించిన వేరే ఏదైనా ఆఫీసులో ఆ డాక్యుమెంట్లు ఉంటే అక్కడి నుంచైనా బారోవర్లు వెనక్కి పొందవచ్చు. డిసెంబర్1 తర్వాత నుంచి శాంక్షనయ్యే లోన్ల విషయంలో శాంక్షన్ లెటర్లలోనే డాక్యుమెంట్లను ఎప్పుడు, ఎలా తీసుకోవచ్చో తప్పనిసరిగా చెప్పాలని కూడా ఆర్బీఐ ఆదేశించింది.
డాక్యుమెంట్లు ఇవ్వకపోతే పరిహారం..
లోన్ మొత్తాన్ని తిరిగి చెల్లించిన తర్వాత 30 రోజులలో డాక్యుమెంట్లను వెనక్కి ఇవ్వకపోతే, ఆ ఆలస్యానికి కారణాలేమిటో బారోవర్లకు బ్యాంకులు తెలియచెప్పాల్సి ఉంటుందని ఆర్బీఐ తాజా ఆదేశాలలో స్పష్టం చేసింది. ఒకవేళ బ్యాంకు తప్పువల్లే ఆలస్యం జరిగితే బారోవర్లకు రోజుకి రూ. 5 వేల చొప్పున పరిహారం చెల్లించాల్సి ఉంటుందని ఆర్బీఐ పేర్కొంది. పెనాల్టీ స్పష్టంగా పేర్కొనడం వల్ల బ్యాంకులలో జవాబుదారీతనం పెరుగుతుందని ఆశిష్ చెప్పారు.
ఒరిజినల్ డాక్యుమెంట్లు డ్యామేజైతే..
ఒకవేళ ఒరిజినల్ డాక్యుమెంట్లకు ఏదైనా డ్యామేజ్ జరిగినా లేదా అవి పోయినా ....డూప్లికేట్ కాపీలు పొందడంలో బారోవర్లకు లెండర్లు సాయపడాలని, అందుకయ్యే ఖర్చును సైతం భరించాలని ఆర్బీఐ స్పష్టం చేసింది. దీనికి అదనంగా రోజుకి రూ. 5 వేల చొప్పున కాంపెన్సేషన్ చెల్లించాలని పేర్కొంది. అయితే, ఇలాంటి సందర్భాలలో బ్యాంకులకు 30 రోజులు కాకుండా మరో 30 రోజులు అంటే మొత్తం 60 రోజులు గడువు ఇవ్వనున్నట్లు ఆర్బీఐ తెలిపింది. మరోవిధంగా చెప్పాలంటే, డిలేడ్ పీరియడ్ పెనాల్టీ 60 రోజుల తర్వాత నుంచి బ్యాంకులు చెల్లించాల్సి ఉంటుందన్న మాట.