
- ఇలాంటి పాలనపై తిరగబడదాం, తరిమికొడదాం
- మీర్పేట బాలిక అత్యాచార ఘటనపై విచారం
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ సిటీ గంజాయి, మత్తు పదార్థాలకు అడ్డాగా మారిందని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. మీర్పేట్ బాలిక అత్యాచార ఘటనపై ఆయన మంగళవారం ట్వీట్ చేశారు. ‘హైదరాబాద్ను విశ్వనగరంగా మార్చామని సీఎం కేసీఆర్ గప్పాలు కొడుతున్నారు. కానీ, బీఆర్ఎస్ పాలనలో సిటీ గంజాయి, మత్తు పదార్థాలకు అడ్డాగా మారింది. నిన్న సింగరేణి కాలనీలో, నేడు మీర్పేట్లో ఆడబిడ్డలపై అఘాయిత్యాలు కలచివేస్తున్నాయి. పోలీసు వ్యవస్థను రాజకీయ ప్రయోజనాలకు వాడుకుని ప్రజల మానప్రాణాలను గాలికొదిలేశారు. ఇలాంటి పాలనపై తిరగబడదాం.. తరిమికొడదాం’ అని రేవంత్ ట్వీట్లో పేర్కొన్నారు.
బీఆర్ఎస్ పాలనలో 88 వేల మంది రైతులు మృతి
పావలా వడ్డీ, బంగారు తల్లి లాంటి పథకాలను కేసీఆర్ అటకెక్కించారని రేవంత్ అన్నారు. తెలంగాణ వస్తే పేదల బతుకులు బాగుపడతాయన్న కేసీఆర్.. వారి సంక్షేమాన్నే మరిచారని ఫైర్ అయ్యారు. వరి వేస్తే ఉరి అని చెప్పిన రైతు వ్యతిరేకి కేసీఆర్ అని విమర్శించారు. కేసీఆర్ సీఎం అయ్యాక 88 వేల మంది రైతులు చనిపోయారని ఆరోపించారు. మంగళవారం చేవెళ్ల నియోజకవర్గానికి చెందిన పలువురు నేతలు జూబ్లీహిల్స్లోని రేవంత్ ఇంట్లో ఆయన సమక్షంలో కాంగ్రెస్లో చేరారు.
దళితులకు మూడెకరాలు, డబుల్ బెడ్రూం ఇండ్లు సహా ఇచ్చిన హామీలను కేసీఆర్ నెరవేర్చలేదని రేవంత్ అన్నారు. దళితులకు భూములిచ్చింది, పేదలకు ఇండ్లు పంచింది కాంగ్రెస్ పార్టీనేనని గుర్తు చేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుస్తుందని, ఇందిరమ్మ రాజ్యం వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కచ్చితంగా రూ.4 వేల పెన్షన్ను అమలు చేస్తామన్నారు. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, బీడీ కార్మికులు తదితరులకు పింఛన్ అందజేస్తామన్నారు.