
- సీఎంపై అన్ని పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేయాలని పీసీసీ చీఫ్ పిలుపు
- ముగిసిన కాంగ్రెస్ 48 గంటల దీక్ష
హైదరాబాద్, వెలుగు: అధికారం ఉందని కేసీఆర్ విర్రవీగుతున్నారని, ఆయన పొగరును అణచేసే టైం వచ్చిందని పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి అన్నారు. కొత్త రాజ్యాంగం కావాలన్న సీఎం కేసీఆర్ మాటలను తేలిగ్గా తీసుకోవద్దని, ఆ మాటల వెనుక బీజేపీ కుట్ర ఉందని అన్నారు. చైనాకు జీవితాంతం అధ్యక్షుడిగా ఉండేందుకు షి జిన్పింగ్ రాజ్యాంగాన్ని మార్చారని, రష్యా, ఉత్తర కొరియాలోనూ అదే పరిస్థితి ఉందన్నారు. ఇక్కడ కూడా కేసీఆర్, ప్రధాని మోడీ అలాంటి ఆలోచనలే చేస్తున్నారని మండిపడ్డారు. రష్యా, చైనా అధ్యక్షులను మోడీ స్ఫూర్తిగా తీసుకుంటే.. కొరియా లీడర్ కిమ్ జోంగ్ఉన్ను కేసీఆర్ స్ఫూర్తిగా తీసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ వ్యాఖ్యలకు నిరసనగా గాంధీభవన్లో ‘రాజ్యాంగాన్ని కాపాడుకుందాం’ అనే నినాదంతో చేపట్టిన 48 గంటల దీక్ష ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చారు. శనివారం రాష్ట్రంలోని అన్ని పోలీస్స్టేషన్లలోనూ కేసీఆర్, టీఆర్ఎస్ నేతలపై ఫిర్యాదు చేయాలని కాంగ్రెస్ శ్రేణులకు సూచించారు. ఆదివారం అంబేద్కర్ విగ్రహాలకు పాలతో అభిషేకం చేయాలన్నారు. సోమవారం పార్లమెంట్లో నిరసన చేస్తామని చెప్పారు.
రాజ్యాంగం లేకుండే: భట్టి
రాజ్యాంగంపై చేసిన వ్యాఖ్యలను బట్టి కేసీఆర్ ఎన్నికలకు అనర్హుడని సీఏల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శించారు. ఆయన్ను సీఎం పదవి నుంచి తొలగిస్తేనే రాజ్యాంగానికి గౌరవమన్నారు. రాజకీయాల్లోకి సీఎం కేసీఆర్ బూతులను తీసుకొచ్చారన్నారు. జనానికి హక్కులు కల్పించిన పవిత్ర పుస్తకం రాజ్యాంగమని అన్నారు. రాజ్యాంగమే లేకుంటే ఇప్పుడు రాజులు, రాజ్యాలు మాత్రమే ఉండేవన్నారు. కేసీఆర్ వ్యాఖ్యలకు నిరసనగా ఆరు నెలలపాటు అంబేద్కర్ విగ్రహాలకు పాలతో అభిషేకం చేస్తామన్నారు. కేసీఆర్ రంగులు మార్చే ఊసరవెల్లి అని పీఏసీ కన్వీనర్ షబ్బీర్ అలీ ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్న రాష్ట్రాల ఏర్పాటు మంచిదని అంబేద్కర్రాజ్యాంగంలో చెప్పడం వల్లే కేసీఆర్ సీఎం అయ్యారని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గీతారెడ్డి అన్నారు. జైలుకు వెళ్తానన్న భయంతోనే కేసీఆర్ కొత్త నాటకానికి తెరదీశారన్నారు.
పదవుల కోసం దిగజారుతున్నరు
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఇండియాను నిలబెట్టడంలో అంబేద్కర్ కృషి ఎంతో ఉందని, మన రాజ్యాంగం గొప్పదనం ప్రపంచ దేశాలకు తెలిసినా కేసీఆర్కు తెలియకపోవడం విచారకరమని రేవంత్ విమర్శించారు. పదవులు, కుర్చీల కోసం కేశవరావు, కడియం శ్రీహరి లాంటి నేతలు దిగజారిపోయి కేసీఆర్ మాటలను సమర్థిస్తున్నారని మండిపడ్డారు. ఆ నేతలే ఇలా దిగజారిపోతే సమాజానికి రక్షణ ఉంటుందా అని ప్రశ్నించారు. రాజ్యాంగాన్ని మార్చాలన్న కేసీఆర్ ఆలోచన గొప్పదంటూ కేశవరావు చట్టసభల్లోనే మాట్లాడేంతగా బరితెగించారన్నారు. ఆయన జ్ఞానం ఏమైందని, ఆ జ్ఞానానికి కరోనా ఏమైనా వచ్చిందా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో అంతో ఇంతో గౌరవమున్న కడియం కూడా పదవి కోసం లాలూచీ పడాల్సిన అవసరముందా అన్నారు.