కేసీఆర్ ఆలోచన మందు షాపులు, బెల్టు షాపులేనని విమర్శించారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. కేసీఆర్ వాళ్ల అమ్మానాన్నల పేరు తప్ప ఏది నిజం చెప్పరంటూ ఎద్దేవా చేశారు. తెలంగాణ నంబర్ వన్ అయ్యిందంటున్న కేసీఆర్ .. ఎందులో నంబర్ వన్ అయ్యిందో చెప్పాలన్నారు. ఇవాళ మూడు వేల వైన్ షాపులు, 60 వేల బెల్టు షాపులతో తెలంగాణ మద్యంలో నంబర్ వన్ అయ్యిందన్నారు. చేవెళ్ల బహిరంగ సభలో మాట్లాడిన రేవంత్.. మల్లిఖార్జున కర్గే కాంగ్రెస్ అధ్యక్షులు అయిన తర్వాత వరుసగా హిమాచల్ ప్రదేశ్ , ఆ తర్వాత కర్ణాటకలో గెలిచామని.. మూడో విజయం తెలంగాణలోనేనని చెప్పారు రేవంత్.
స్వేచ్ఛతో కూడిన తెలంగాణ కావాలన్నారు రేవంత్ .కేసీఆర్ మంత్రివర్గంలో మాదిగలకు స్థానం లేదని ..115 మంది బీఆర్ఎస్ అభ్యర్థుల్లో ముదిరాజ్ లకు ఒక్క సీటు కూడా ఇవ్వలేదన్నారు. కేసీఆర్ తొమ్మిదేళ్ల పాలనలో ఉద్యమకారులకు గుర్తింపు లేదు.. అమరవీరుల కుటుంబాలను ఆదుకోలేదని విమర్శించారు.
దళితుల భూములు కేసీఆర్ ఆక్రమించుకున్నారని ఆరోపించారు రేవంత్. కేసీఆర్ పాలనలో దళితులకు మూడెకరాల భూమియ్యలేదు.. డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టియ్యలేదని... ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా సక్రమంగా నెరవేర్చలేదని మండిపడ్డారు. ఇవాళ బీఆర్ఎస్ నేతలు వంద కోట్లు పెట్టి ఎకరం కొనే స్థాయికి ఎదిగారు.. కానీ పేదలు వంద గజాల స్థలం కొనే పరిస్థితి లేదన్నారు రేవంత్.