ధరణిపై నిజనిజాలు నిగ్గుతేలుస్తాం : రేవంత్ రెడ్డి

ధరణిపై నిజనిజాలు నిగ్గుతేలుస్తాం : రేవంత్ రెడ్డి

తెలంగాణ రాష్ర్టంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ధరణిపై నిజనిజాలు నిగ్గుతేలుస్తామని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ధరణి వెనుక చాలా కంపెనీలు ఉన్నాయన్నారు. ధరణి నిర్వహిస్తున్న సంస్థలో విదేశీయులు ఉన్నారని చెప్పారు. ధరణి నిర్వహణ మొత్తం శ్రీధర్ గాదె చేతుల్లో ఉందని, అర్ధరాత్రి సమయంలో రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయని వివరించారు. ప్రస్తుతం ILF  సంస్థకు ఒక్కశాతం వాటా మాత్రమే ఉందన్నారు. తెలంగాణకు చెందిన పౌరుల వివరాలన్నీ విదేశీయుల చేతుల్లో ఉన్నాయన్నారు. 

కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ధరణి పోర్టల్ ను తీసేస్తామని చెప్పగానే సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ తమపై ఏడుస్తున్నారంటూ రేవంత్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ధరణి ద్వారా ఎలాంటి సమస్యలు లేకుండా చేస్తామని, మరింత మెరుగ్గా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. జులై 15వ తేదీ తర్వాత ధరణిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తామన్నారు. ధారవాహిక తరహాలో ‘ధరణి దోపిడీ’ గురించి వివరిస్తామన్నారు. 

Also Read :- సింగ‌రేణి ఉద్యోగుల పిల్లలకు ఎంబీబీఎస్ సీట్లలో రిజ‌ర్వేష‌న్

ధరణి గురించి బీజేపీ నాయకులు మాత్రం మాట్లాడడం లేదని, ఎందుకు భయమని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ప్రస్తుతం తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషిన్ రెడ్డి ధరణిపై తమ స్టాండ్ ఏంటో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాదు.. ధరణిలో పెట్టుబడులు పెట్టింది ఎవరు..? వాళ్లు ఎక్కడి వాళ్లు.. ? ఏ దేశ పౌరులు వంటి వివరాలను బయటపెట్టాలని కిషన్ రెడ్డిని డిమాండ్ చేశారు.