కర్ణాటక ఫలితాలే తెలంగాణలో పునరావృతం కాబోతున్నాయని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేయడం ఖాయమన్నారు. భారత్ జోడోయాత్రతో కాంగ్రెస్ లో జోష్ వచ్చిందన్నారు. జోడో యాత్ర తర్వాత కాంగ్రెస్ వరుస విజయాలు సాధిస్తోందన్నారు. హిమాచల్ లో తొలి విజయం, కర్ణాటకలో రెండో విజయం, తెలంగాణలో మూడో విజయం సాధించబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు రేవంత్.
కర్ణాటకలో మత రాజకీయాలను ప్రజలు తిప్పికొట్టారని రేవంత్ అన్నారు. కాంగ్రెస్ పార్టీకి మతం ఒక విశ్వాసమే కానీ.. రాజకీయ అంశం కాదన్నారు. మత రాజకీయాలను ప్రోత్సహిస్తున్న బీజేపీని ప్రజలు తిప్పి కొట్టి మోడీ నాయకత్వాన్ని ఓడించారని తెలిపారు.
జేడీఎస్ ను ఓడించి కేసీఆర్ ను తిరస్కరించారని రేవంత్ అన్నారు. బీఆర్ఎస్ కార్యక్రమాల్లో పాల్గొన్న కుమారస్వామిని ఓడించారని చెప్పారు. కర్ణాటక ఫలితాలే తెలంగాణలో పునరావృతం కాబోతున్నాయన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపు బీఆర్ఎస్ కు ఇష్టం లేదని. అందుకే కర్ణాటక ఫలితాలు తెలంగాణలో పునరావృతం కాబోవని కేటీఆర్ ట్వీట్ చేశారన్నారు.
