పఫోస్ (సైప్రస్): ప్రతిష్టాత్మక ఫిడే క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్లో ఇండియా గ్రాండ్ మాస్టర్ ఆర్. ప్రజ్ఞానంద తొలి ఓటమిని ఎదుర్కొన్నాడు. తొలి రౌండ్లో నెగ్గి రెండో గేమ్ను డ్రా చేసుకున్న ప్రజ్ఞా మంగళవారం జరిగిన మూడో రౌండ్లో ఉజ్బెకిస్తాన్ ప్లేయర్ జావోఖిర్ సిందరోవ్ చేతిలో పరాజయం పాలయ్యాడు. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్లో తెల్లపావులతో ఆడిన ప్రజ్ఞానంద చివర్లో చేసిన తప్పిదం సిందరోవ్కు కలిసొచ్చింది.
ఇతర మ్యాచ్ల్లో అమెరికా స్టార్ ఫాబియానో కారువానా చైనాకు చెందిన వీ యిని19 ఎత్తుల్లోనే ఓడించాడు. హికారు నకమురా–-అనీష్ గిరి, మాథియాస్ బ్లూబామ్-– ఆండ్రీ ఎసిపెంకో గేమ్స్ డ్రాగా ముగిశాయి. ఇక, విమెన్స్ సెక్షన్లో ఆర్. వైశాలి మూడో రౌండ్ గేమ్ను 41 ఎత్తుల తర్వాత ఉక్రెయిన్ ప్లేయర్ అనా ముజిచుక్తో డ్రా చేసుకుంది. మరో ఇండియన్ దివ్య దేశ్ముఖ్ 81 ఎత్తుల సుదీర్ఘ పోరాటం తర్వాత రష్యా జీఎం అలెగ్జాండ్రా గోరాచ్కినాతో పాయింట్ పంచుకుంది.
