సివిల్‌‌ వివాదంలో రేవంత్ రెడ్డిని ఇరికించారు..ఎస్సీ, ఎస్టీ కేసులో హైకోర్టుకు నివేదించిన న్యా యవాది

సివిల్‌‌ వివాదంలో రేవంత్ రెడ్డిని ఇరికించారు..ఎస్సీ, ఎస్టీ కేసులో హైకోర్టుకు నివేదించిన న్యా యవాది
  • సంఘటన జరిగినప్పుడు ఆయన ఆ స్థలంలో లేరు

హైదరాబాద్, వెలుగు: సివిల్‌‌ వివాదంలో రేవంత్‌‌ రెడ్డిని అనవసరంగా ఇరికించారని హైకోర్టుకు ఆయన తరఫు న్యాయవాది విన్నవించారు. హైదరాబాద్‌‌ గచ్చిబౌలిలో 2016లో నమోదైన ఎస్సీ, ఎస్టీ కేసుకు సంబంధించి సంఘటనా స్థలంలో ఆయన లేరని హైకోర్టుకు నివేదించారు. గోపన్​పల్లిలో సర్వే నం.127లోని 31 ఎకరాలకు సంబంధించి హక్కుల వివాదంలో ఎస్సీ మ్యూచ్యువల్లీ ఎయిడెడ్‌‌ కోఆపరేటివ్‌‌ హౌసింగ్‌‌ సొసైటీకి, రేవంత్‌‌ రెడ్డి సోదరుడు ఎ.కొండల్‌‌రెడ్డి, ఎ.లక్ష్మయ్యల మధ్య వివాదం కొనసాగుతోంది.

ఇందులో భాగంగా అప్పట్లో ఎంపీగా ఉన్న రేవంత్‌‌ రెడ్డి ప్రోత్సాహంతో సొసైటీకి చెందిన స్థలంలోకి అక్రమంగా చొరబడ్డారని, అడ్డుకున్న తనపై కులం పేరుతో దూషించారంటూ ఎన్‌‌.పెద్దిరాజు అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు. దీన్ని కొట్టివేయాలని కోరుతూ రేవంత్‌‌ రెడ్డి 2020లో హైకోర్టులో పిటిషన్‌‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌‌పై జస్టిస్‌‌ మౌసమీ భట్టాచార్య శుక్రవారం విచారణ చేపట్టారు. రేవంత్‌‌ రెడ్డి తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. సంఘటన సమయంలో పిటిషనర్‌‌ అక్కడ లేరని తెలిపారు.

పోలీసులు దాఖలు చేసిన అభియోగ పత్రంలో కూడా పిటిషనర్‌‌ ప్రోత్సాహంతో అని అన్నారే తప్ప.. సంఘటన స్థలంలో రేవంత్‌‌ ఉన్నట్లు చెప్పలేదని గుర్తుచేశారు. పబ్లిక్‌‌ ప్రాసిక్యూటర్‌‌ పల్లె నాగేశ్వరరావు వాదనలు వినిపిస్తూ.. ఇదే భూమికి సంబంధించి గతంలో ఇదే ఫిర్యాదుదారు చందానగర్‌‌ పోలీసు స్టేషన్‌‌లో పిటిషనర్‌‌‌‌పై  ఫిర్యాదు చేశారని చెప్పారు. అక్కడ ప్రధాన నిందితుడిగా రేవంత్‌‌ రెడ్డి ఉన్నారన్నారు.

ఫిర్యాదుదారు తరఫు న్యాయవాది నిమ్మ నారాయణ వాదనలు వినిపిస్తూ.. 2020 నుంచి రేవంత్‌‌ రెడ్డి కోర్టు విచారణకు హాజరుకావడం లేదని, ఇప్పటి వరకు అభియోగాల నమోదు ప్రక్రియ కూడా జరగలేదని చెప్పారు. ఈ కేసులో ఉన్న స్టేను తొలగించాలని కోరుతూ మధ్యంతర పిటిషన్‌‌ దాఖలు చేశామన్నారు. వాదనలను విన్న న్యాయమూర్తి విచారణను వచ్చే వారానికి వాయిదా వేశారు.