
- మంజూరు చేయాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి
- ట్రిపుల్ ఆర్ నార్త్ పనులు ప్రారంభించండి.. సౌత్కు పర్మిషన్ ఇవ్వండి
- మన్ననూర్-శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్ నిర్మించాలి
- రావిర్యాల-ఆమన్గల్-మన్ననూర్ గ్రీన్ఫీల్డ్ హైవే చేపట్టండి
- హైదరాబాద్–మంచిర్యాల గ్రీన్ఫీల్డ్ హైవే మంజూరు చేయాలని వినతి
న్యూఢిల్లీ, వెలుగు: హైదరాబాద్లో నిర్మిస్తున్న భారత్ ఫ్యూచర్ సిటీ నుంచి ఏపీలోని అమరావతి మీదుగా బందరు పోర్ట్ వరకు 12 వరుసల గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణానికి వెంటనే అనుమతులు మంజూరు చేయాలని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ‘‘రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణ, ఏపీ రాజధానుల మధ్య గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మించాల్సి ఉంది. తెలంగాణకు ఓడరేవు లేనందున బందరు పోర్ట్ వరకు సరకు రవాణాకు వీలుగా గ్రీన్ ఫీల్డ్ హైవే మంజూరు చేయాలి. ఇది 118 కి.మీ. తెలంగాణలో ఉంటుంది. మిగతా భాగం ఏపీలో ఉంటుంది” అని వివరించారు. మంగళవారం ఢిల్లీలో కేంద్రమంత్రి గడ్కరీతో ఆయన నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. దాదాపు అరగంటకు పైగా సాగిన ఈ సమావేశంలో నేషనల్ హైవేల నిర్మాణం, అనుమతులు, పనుల వేగవంతంపై చర్చించారు.
ట్రిపుల్ ఆర్ సౌత్కు అనుమతిలివ్వండి..
ట్రిపుల్ ఆర్ నార్త్కు సంబంధించి 90 శాతం భూసేక రణ పూర్తయిందని కేంద్రమంత్రి గడ్కరీకి సీఎం రేవం త్ రెడ్డి వివరించారు. వెంటనే ఫైనాన్షియల్, కేబినెట్ అనుమతులు ఇచ్చి పనులు ప్రారంభించాలని కోరారు. అలాగే ట్రిపుల్ ఆర్ నార్త్కు సమాంతరంగా ట్రిపుల్ ఆర్ సౌత్ పనులు చేపట్టాలని, ఇందుకు అన్ని అనుమతులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ను ప్రసిద్ధ శైవ క్షేత్రం శ్రీశైలంతో అనుసంధానించే మన్ననూర్–శ్రీశైలం రహదారి అమ్రాబాద్ టైగర్ రిజర్వు పరిధిలో ఉన్నందున నాలుగు వరుసల ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి అనుమతులు మంజూరు చేయా లని రిక్వెస్ట్ చేశారు.
ఈ ఎలివేటెడ్ కారిడార్ పూర్తయితే ఏపీలోని కృష్ణపట్నం రేవుతో పాటు మార్కాపురం, కంభం, కనిగిరి, నెల్లూరుకు రాకపోకలు సులభతరమవుతాయని చెప్పారు. రావిర్యాల–ఆమన్గల్–మన్ననూర్ మధ్య నాలుగు వరుసల గ్రీన్ఫీల్డ్ రహదారి నిర్మించాలని కోరారు. ‘‘హైదరాబాద్, మంచిర్యాల మధ్య ఉన్న రాజీవ్ రహదారిపై వాహన రద్దీ అధికంగా ఉంది. హైదరాబాద్–మంచిర్యాల మధ్య నూతన గ్రీన్ఫీల్డ్ హైవే మంజూరు చేయండి” అని సీఎం విజ్ఞప్తి చేశారు.
22న హైదరాబాద్లో సమీక్ష..
సీఎం రేవంత్ రెడ్డి చేసిన విజ్ఞప్తులపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సానుకూలంగా స్పందించారు. సీఆర్ఐఎఫ్ పనులకు వారంలోపు అనుమతులు ఇస్తామని హామీ ఇచ్చారు. అలాగే భారత్ ఫ్యూచర్ సిటీ–అమరావతి–బందరు పోర్ట్ గ్రీన్ఫీల్డ్ రహదారికి సంబంధించి తన శాఖ అధికారులను హైదరాబాద్కు పంపిస్తానని చెప్పారు. ఈ అంశంపై ఎన్హెచ్, ఎన్హెచ్ఏఐ అధికారులతో ఈ నెల 22న హైదరాబాద్లో సమీక్ష నిర్వహిస్తామని గడ్కరీకి సీఎం తెలిపారు.