33 జిల్లాల్లో వందల కోట్ల భూమిని దోచి పెట్టారు

33 జిల్లాల్లో వందల కోట్ల భూమిని దోచి పెట్టారు

సీఎం కేసీఆర్ దళితులకు మూడెకరాల భూమి ఇవ్వలేదని మండిపడ్డారు టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి. గిరిజనులకు పోడు భూములపై హక్కు కల్పించలేదని విమర్శించారు. వేల కోట్ల ప్రైవేట్ దోపిడి, వందల కోట్ల పార్టీ ఆస్తులు ఉన్నా.. కేసీఆర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ (టీఆర్ఎస్) కి 33 జిల్లాల్లో వందల కోట్ల విలువ చేసే ప్రజల భూమిని దోచి పెట్టారని ట్వీట్ చేశారు రేవంత్ రెడ్డి.  ఈ బరితెంగింపును ఇట్లానే వదిలేద్దామా అని ప్రశ్నించారు.  బంజారాహిల్స్ లో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి భూమి కేటాయింపుపై టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, రాష్ట్ర సీఎస్ లకు హైకోర్టు గురువారం నోటీసులిచ్చింది. 

హైదరాబాద్ బంజారాహిల్స్ లోని NBT నగర్ లో TRS పార్టీ కార్యాలయానికి జరిగిన భూమి కేటాయింపుపై పిల్ దాఖలైంది. కోట్లు విలువ చేసే భూమిని తక్కువ ధరకు కేటాయించారని పిటిషన్ వేశారు. పిటిషనర్ తరపున వాదనలు విన్న ప్రధాన ధర్మాసనం టీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ, సీఎస్, హైదరాబాద్ కలెక్టర్ కు నోటీసులు ఇచ్చారు. వీరితో పాటు రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీకి కూడా నోటీసులిచ్చారు. కోట్లు విలువ చేసే భూమిని కేటాయించారంటూ పిటీషనర్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. హైదరాబాద్ సహా 33 జిల్లాల్లో ఇదే విధంగా జరిగిందన్నారు పిటిషనర్. దీనిపై నాలుగు వారాల్లో వివరణ ఇవ్వాలని హై కోర్టు ఆదేశించింది.