
హైదరాబాద్, వెలుగు: రాజేంద్రనగర్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని శేరిలింగంపల్లి మండలం గోపన్ల్లిలోని సర్వే నంబర్ 127లోని భూమిని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్ రెడ్డి, ఆయన సోదరుడు కొండల్ రెడ్డి అక్రమంగా మ్యుటేషన్ చేయించుకున్నారని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమయ్కుమార్కు ఆర్డీఓ చంద్రకళ మంగళవారం నివేదిక సమర్పించారు. రేవంత్రెడ్డి, కొండల్ రెడ్డికి 127వ సర్వే నంబర్లో 1.21 ఎకరాల భూమిని ఎరగండ్ల లక్ష్మయ్య సన్నాఫ్ మల్లయ్య అమ్మినట్లుగా ఉందని, కానీ గత రికార్డుల ప్రకారం చూస్తే ఎక్కడా ఆ ఇంటి పేరుతో పట్టాదారు లేరని నివేదికలో పేర్కొన్నారు. ఈ సర్వే నంబర్లో 1954 – 55 నుంచి ఎర్ఆర్యూపీ నిర్వహించే వరకు పహానీలో ఎవరెవరి పేర్లు వచ్చాయో నివేదికలో వివరించారు. సర్వే నంబర్ 126లో ఉన్న కోమటిచెరువులోకి నీళ్లు వెళ్లకుండా ఎఫ్టీఎల్ నిబంధనలకు విరుద్ధంగా రేవంత్ రెడ్డి, కొండల్ రెడ్డి, కృష్ణారెడ్డి గోడ నిర్మించారన్నారు. వాల్టా చట్టానికి విరుద్ధంగా ఉన్న ఈ గోడను కూల్చివేయాలని నివేదికలో తెలిపారు. ఈ. శ్రీశైలం, కల్లం పేరిరెడ్డి, ఈ.అనిల్ కుమార్, బి.భాస్కర్, ఎన్పీ రాజు, కె.శేఖర్రెడ్డి, మసీద్ శ్రీకాంత్, కె.జయలక్ష్మి, ఆశమ్మ, సాబేరా బేగం మొదలైనవారితోపాటు మరికొందరు ఇచ్చిన వాంగ్మూలాలను ఈ సందర్భంగా నివేదికలో నమోదు చేశారు. ఇవే భూముల విషయంలో కొండల్ రెడ్డికి ఎన్పెద్దిరాజు మధ్య నడుస్తున్న కేసును గతంలో గచ్చిబౌలి స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎలాంటి కారణాలు లేకుండానే పక్కన పెట్టారని తెలిపారు. ప్రస్తుతం ఈ కేసును రీ ఓపెన్ చేయడం జరిగిందని, ఈ కేసు పురోగతి గురించి గచ్చిబౌలి ఎస్హెచ్ఓకు శేరిలింగంపల్లి తహసీల్దార్ లేఖ రాశారని వెల్లడించారు. వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా అన్ని పక్షాలకు నోటీసులు అందజేసి సపోర్టింగ్ డాక్యుమెంట్స్ఆధారంగా ఇంకా సమగ్రంగా విచారించాల్సి ఉందని పేర్కొన్నారు. త్వరలోనే ఈ విచారణనుపూర్తి చేసి, పూర్తి స్థాయి నివేదికను సమర్పిస్తామన్నారు