- పోయిన నెలతో పోలిస్తే రూ.127 కోట్లు ఎక్కువ
- 8 నెలల్లో రిజిస్ట్రేషన్స్ శాఖకు రూ.5,777 కోట్ల ఆమ్దానీ
- భూముల విలువలు పెంచినంక పెరిగిన రాబడి
హైదరాబాద్, వెలుగు:స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖకు ఐదు నెలలుగా ఆమ్దానీ జోర్దార్గా వస్తోంది. భూముల విలువలు, రిజిస్ట్రేషన్ల చార్జీల పెంపు తర్వాత నెలనెలా రాబడి ఎక్కువైంది. ఈ ఫైనాన్షియల్ ఇయర్ మొదలయ్యాక మొదటి మూడు నెలలు ఆదాయం అంతంతే ఉన్నా.. తర్వాత రాబడి రెట్టింపైంది. గత ఎనిమిది నెలల్లో రిజిస్ట్రేషన్ల శాఖకు రూ.5,777 కోట్ల ఆదాయం వచ్చింది. ఒక్క నవంబర్ నెలలోనే రూ.950 కోట్లు వచ్చాయి. ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో ఇప్పటిదాకా ఎక్కువగా జులైలో రూ.991 కోట్లు వచ్చాయి. ఆ తర్వాత నవంబర్ ఆదాయమే రెండో హయ్యెస్ట్ కావడం విశేషం.
చార్జీలు పెంచాకనే..
రాష్ట్ర ప్రభుత్వం అగ్రికల్చర్, నాన్ అగ్రికల్చర్ భూములు, ఆస్తుల మార్కెట్ విలువలు, రిజిస్ట్రేషన్ చార్జీలను ఏరియాను బట్టి 30 నుంచి 50 శాతం పెంచింది. జులై 22 నుంచి కొత్త చార్జీలు అమల్లోకి వచ్చాయి. భూముల విలువలు, రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచకముందు రిజిస్ట్రేషన్ల శాఖకు ప్రతినెలా రూ.500 కోట్ల ఆదాయమే వచ్చేది. పెంపు తర్వాత గత ఏడాదితో పోలిస్తే ఆదాయం 40 శాతం పెరిగింది. ఈ ఆర్థిక సంవత్సరంలో రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా రూ.12 వేల కోట్ల ఆదాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో టార్గెట్గా పెట్టుకుంది.
ఇప్పటిదాకా వచ్చిన రాబడిని బట్టి చూస్తే.. 2022 మార్చి నాటికి అది రూ.10 వేల కోట్ల వరకు వెళ్లే అవకాశం ఉన్నట్టు చెప్తున్నారు. ఏప్రిల్లో రూ. 582 కోట్లు రాగా, మే నెలలో లాక్ డౌన్ వల్ల కేవలం రూ.138 కోట్లే వచ్చాయి. జూన్లో రూ.630 కోట్ల ఆదాయం సమకూరింది. రిజిస్ట్రేషన్ చార్జీలు పెరుగుతాయన్న వార్తల నేపథ్యంలో జులై రెండో వారం, మూడో వారం రిజిస్ట్రేషన్లు చాలా ఎక్కువగా జరిగాయి. దీంతో ఆ ఒక్క నెలలోనే రూ.991 కోట్ల ఆదాయం వచ్చింది. ఆ తర్వాత ఆగస్టులో రూ.775 కోట్లు , సెప్టెంబర్లో రూ.888 కోట్లు, అక్టోబర్లో రూ.823 కోట్ల రాబడి వచ్చింది.