దిశ జాడ లేదు.. 8 నెలలుగా కానరాని సమీక్ష

దిశ జాడ లేదు..  8  నెలలుగా కానరాని సమీక్ష
  • మూడేండ్లలో రెండు సార్లే  దిశ రివ్యూ మీటింగ్​
  • కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలపై రివ్యూ చేసేందుకు ఇష్టపడని బీఆర్ఎస్​ ఎంపీలు

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలును సమీక్షించేందుకు ఏర్పాటు చేసిన దిశ(జిల్లా అభివృద్ధి సమన్వయ, మానిటరింగ్​ కమిటీ) కమిటీ జాడ లేకుండా పోయింది.  ప్రతి మూడు నెలలకోసారి రివ్యూ చేయాల్సి ఉన్నప్పటికీ కమిటీ చైర్ పర్సన్ గా ఉన్న మహబూబాబాద్​ ​ ఎంపీ మాలోత్​ కవిత ముందుకు రావడం లేదు. మూడేండ్లలో దిశ కమిటీ మీటింగ్​ కేవలం రెండు సార్లు మాత్రమే జరిగింది.  సెంట్రల్​ గవర్నమెంట్​ స్కీమ్స్​ అమలుపై రివ్యూ చేస్తే  కేంద్రంలోని బీజేపీ సర్కార్‌‌కు ఎక్కడ పేరు వస్తుందోనని  బీఆర్ఎస్​ ఎంపీలు రివ్యూ చేసేందుకు ఇంట్రస్ట్​ చూపడం లేదు.  

మూడేండ్లలో రెండు సార్లే :

కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న దాదాపు 20కి పైగా అభివృద్ధి పథకాలపై ప్రతి మూడు నెలలకోసారి ఆఫీసర్లతో రివ్యూ చేసేందుకు దిశ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఎంపీలతో పాటు జిల్లాలోని ఎమ్మెల్యేలు సెలెక్ట్​ చేసిన జడ్పీటీసీలు, ఎంపీపీలతో పాటు కో ఆప్షన్​ మెంబర్లు దిశ కమిటీలో మెంబర్లుగా ఉంటారు.  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దిశ కమిటీ చైర్మన్​గా మహబూబాబాద్​ ఎంపీ మాలోత్​ కవిత చైర్మన్​గా వ్యవహరిస్తున్నారు. 

ఉపాధి హామీ పథకంలో పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నాయి.  సోషల్​ ఆడిట్లో అక్రమాలు వెలుగులోకి వస్తున్నా రికవరీ మాత్రం అంతంత మాత్రంగానే ఉంటుంది.  పోషక లోపంతో జిల్లాలో వేలాది మంది చిన్నారులు అవస్థలు పడ్తున్నారు.  కొత్తగూడెం(భద్రాచలం రోడ్​) రైల్వే స్టేషన్​ నుంచి పలు రైళ్లు తరుచూ రద్దు అవుతుండడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. యువతులతో పాటు గర్బిణులు, బాలింతలను రక్తహీనత వేధిస్తొంది. శ్యాంప్రసాద్​ ముఖర్జీ రూర్బన్​ మిషన్​ స్కీం, ప్రధాన మంత్రి ఉపాధి కల్పన స్కీంపై జిల్లా యువతకు పెద్దగా అవగాహన లేకుండా పోయింది.  

నవంబర్ నుంచి ఇప్పటి వరకు మీటింగ్ పెట్టలే..

 కొత్తగూడెం, పాల్వంచ, ఇల్లెందు మున్సిపాలిటీల్లో ప్రజల ఆరోగ్యాలను దెబ్బతీసే మొక్కలను పెంచారని వాటిని తొలగించాలని నవంబర్​లో నిర్వహించిన దిశ మీటింగ్‌లో సభ్యులు డిస్కస్​ చేశారు.  ఇప్పటి వరకు వాటి గురించి పట్టించుకున్న దాఖలాలు లేవు.  కొత్తగూడెంలోని మాతా, శిశు సంరక్షణ హాస్పిటల్‌లో శిశు మరణాలు ఎక్కువ జరుగుతున్నాయి.  వీటిపై చర్చిద్దామంటే దిశ మీటింగ్​ పెట్టడం లేదని సభ్యులు వాపోతున్నారు. 

ఇదిలా ఉండగా కేంద్రం, రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా సంక్షేమ పథకాల అమలుపై రివ్యూ నిర్వహించడం వల్ల పనులు స్పీడ్​గా అవడంతో పాటు ఆఫీసర్లు బాధ్యతతో మరింత ఎక్కువగా పనిచేసే అవకాశం ఉందని పలువురు దిశ కమిటీ మెంబర్లు పేర్కొంటున్నారు.  దిశ మీటింగ్‌తో  కేంద్రం నుంచి ఇంకా ఏయే  పనులకు ఫండ్స్​ తెచ్చుకోవాలో కమిటీ మెంబర్లు ఎంపీల దృష్టికి తీసుకువచ్చే అవకాశం ఉంది. ఇంతటి ప్రాధాన్యత గల దిశ కమిటీ మీటింగ్‌ను నిర్వహించేందుకు ఎంపీలు ముందుకు రాకపోవడం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

కేంద్ర పథకాలపై  సమీక్ష లేక ఇబ్బందులు 

ప్రధానమంత్రి కిసాన్​ సమ్మాన్​ నిధి, టెలికాం సేవలు, అగ్రికల్చర్​, హార్టికల్చర్‌‌ విభాగాలపై చర్చించాల్సిన అవసరముంది. ఆహార భద్రతా పథకంలో భాగంగా అంత్యోదయ  రేషన్​ కార్డుల జారీ నిలిచిపోయింది. మావోయిస్ట్​ ప్రభావిత ప్రాంతాల్లో జరుగుతున్న రూ. వందల కోట్ల విలువైన పనులపై ఇప్పటి వరకు సమీక్షించలేదు.  నేషనల్​ హైవేలో భాగంగా జిల్లాలో నిర్మిస్తున్న రోడ్లు, బ్రిడ్జిల పనులు నత్తనడకన సాగుతున్నాయి.  అసంపూర్తి నిర్మాణాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్తున్నారు.  గవర్నమెంట్ హాస్పిటల్స్​ కేంద్ర నిధులతో చేపడ్తున్న స్కీంలపై సమీక్ష కానరావడం లేదు.  డ్రింకింగ్​ వాటర్​, ఫారెస్ట్​, ముద్ర లోన్స్​లాంటి పలు స్కీమ్స్ పై సమీక్షించాల్సి ఉంది.