
హైదరాబాద్, వెలుగు: టెక్నాలజీ సమాజానికి ఉపయోగపడాలని, దానికి తగ్గట్టుగా విద్యార్థులు కొత్త ఆవిష్కరణలు రూపొందించాలని కేంద్ర విద్యాశాఖ మాజీ కార్యదర్శి ఆర్. సుబ్రమణ్యం కోరారు. విద్యార్థులు తమలోని నైపుణ్యాన్నీ, జ్ఞానాన్ని సొసైటీ డెవలప్మెంట్కోసం అందించాలని సూచించారు. శనివారం గచ్చిబౌలిలోని బ్రహ్మకుమారిస్ ఆడిటోరియంలో రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెజ్డ్ టెక్నాలజీస్ (ఆర్జీయూకేటీ–బాసర) ఆరవ కాన్వొకేషన్ జరిగింది. వర్సిటీ వైస్ చైర్మన్ ప్రొఫెసర్ వెంకటరమణ అధ్యక్షతన జరిగిన సమావేశానికి సుబ్రమణ్యం చీఫ్ గెస్టు గా హాజరై మాట్లాడారు.
విద్యార్థులకు పట్టుదల, వినయం ఉండాలని, వారు ఉన్నత శిఖరాలు అధిరోహించడానికి అవి ఉపయోగపడతాయని చెప్పారు. సామర్థాన్ని విశ్వసించే కలలను ఆలోచనలుగా మార్చుకోవాలని తెలిపారు. ఆర్జీయూకేటీ వారసత్వాన్ని దేశ ఆక్షాంక్షలకు తగ్గట్గుగా ముందుకు తీసుకుపోవాలని కోరారు. ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ డైరెక్టర్ నారాయణన్ మాట్లాడుతూ..ఆర్జీయూకేటీకి ఐఐఐటీహెచ్కు అవినాభావ సంబంధం ఉందన్నారు. ఆర్జీయూకేటీ వీసీ వెంకటరమణ మాట్లాడుతూ... దాదాపు 18 ప్రముఖ విద్యాసంస్థలు, అంకుర సంస్థలతో ఎంఓయూలు చేసుకున్నట్టు చెప్పారు.
నిజామాబాద్ లో ఆర్జీయూకేటీకి ఇన్నోవేషన్ సెంటర్ ను ఏర్పాటు చేసినందుకు మంత్రి కేటీఆర్కు కృతజ్ఞతలు చెప్పారు. కార్యక్రమంలో హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి, ఐటీశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ జయేశ్రంజన్, ఎడ్యుకేషన్ సెక్రెటరీ వాకాటి కరుణ, మాజీ వీసీ రాజిరెడ్డి, వర్సిటీ డైరెక్టర్ సతీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన 11 మంది విద్యార్థులకు గోల్డ్ మెడల్స్ అందించారు. వీరితో పాటు 160 మందికి డిగ్రీ పట్టాలు ప్రదానం చేశారు.