
హుజూరాబాద్, వెలుగు: లాక్డౌన్ టైమ్లో ఇబ్బంది పడుతున్న తన ఊర్లోని పేదోళ్లకు సాయం చేద్దమనుకున్నరో సర్పంచ్. అనుకున్నదే ఆలస్యం తన మూడెకరాల వరి పంటను పంచేశారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం శాలపల్లి గ్రామ సర్పంచ్ కొడిగూటి శారద ప్రవీణ్.. మూడెకరాల్లో సన్నరకం వరిని పండించారు. తిండి లేక బాధపడుతున్న ఊర్లోని పేదోళ్లకు తనవంతు సాయం చేయాలనుకున్నారు. ఊర్లోని సుమారు 200 నిరుపేద కుటుంబాలను గుర్తించారు. బుధవారం హుజూరాబాద్ ఎంపీపీ ఇరుమల్ల రాణి సురేందర్, హుజూరాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ గందె రాధిక చేతుల మీదుగా వాళ్లకు పంపిణీ చేశారు. పండిన పంటనంతా ఆపత్కాలంలో గ్రామ ప్రజలకు పంచడం ఆనందంగా ఉందని శారద అన్నారు.