Rishabh Pant: ఐసీయూలో రిషబ్ పంత్

Rishabh Pant: ఐసీయూలో రిషబ్ పంత్

టీమిండియా స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ ప్రస్తుతం ఐసీయూలో చికిత్స కొనసాగుతోందని బీసీసీఐ ప్రకటించింది. ఈ ఉదయం రోడ్డు ప్రమాదంలో రిషబ్ పంత్ తీవ్రంగా గాయపడ్డాడు. పంత్ నుదురు చిట్లినట్లు బీసీసీఐ తెలిపింది. వీపుపై కాలిన గాయాలు , కుడి మోకాలి లిగ్మెంట్ చిట్లినట్లు ఎక్స్ రేలో తేలినట్లు ప్రకటించింది. ప్రస్తుతం పంత్ ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు, ఇతర స్కాన్ ల కోసం ట్రీట్ మెంట్ కొనసాగుతోందని బీసీసీఐ కార్యదర్శి జైషా ప్రకటించారు. పంత్ కుటుంబసభ్యులతోనూ మాట్లాడినట్లు చెప్పారు. రిషబ్ పంత్ త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. పంత్ ఆరోగ్యపరిస్థితిని ఎప్పటికప్పుడు బీసీసీఐ పరిశీలిస్తోందని చెప్పారు. ఎలాంటి సహాయ సహకారాలు అందించేందుకైనా బీసీసీఐ సిద్ధంగా ఉందని జైషా చెప్పారు.పంత్ త్వరగా కోలుకోవాలని బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్షా ఆకాంక్షించారు. ప్రస్తుతం డెహ్రాడూన్ హాస్పిటల్ లో పంత్ కు ట్రీట్మెంట్ కొనసాగుతోంది. 

మరో వైపు పంత్ చికిత్స నిమిత్తం అన్ని ఏర్పాట్లు చేయాలని ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి ఆదేశాలు జారీ చేశారు. వైద్య ఖర్చులను తామే భరిస్తామని చెప్పారు. అవసరమైతే ఎయిర్ అంబులెన్స్ కూడా అందించాలని కోరారు. పంత్ ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు ప్రకటించారు. ప్రమాద సమయంలో కారులో పంత్ ఒక్కడే ఉన్నట్లు ఉత్తరాఖండ్ డీజీపీ అశోక్ కుమార్ తెలిపారు. వాహనంపై నియంత్రణ కోల్పోవడం వల్లే ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక నిర్ధారణకు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఢిల్లీ నుంచి రూర్కీకి తమ బంధువులను కలిసేందుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు హరిద్వార్ రూరల్ ఎస్పీ SK సింగ్ తెలిపారు.