న్యూఢిల్లీ: టీమ్ ఇండియా యువ కెరటం రిషబ్ పంత్ భీకర ఫామ్లో ఉన్నాడు. వరుసగా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ సిరీస్ల్లో రాణించిన ఈ వికెట్ కీపర్ బ్యాట్స్మన్.. ఐపీఎల్లోనూ సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ రెగ్యులర్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ గాయంతో సీజన్ కు దూరమైనందున జట్టుకు పంత్ రాణింపు కీలకం కానుంది. అందుకే పంత్ను ఎక్స్ ఫ్యాక్టర్ అంటున్నాడు సీనియర్ కీపర్ పార్థివ్ పటేల్.
'రిషభ్ గత సీజన్లో ఫామ్లో లేడు. కానీ ఈ యేడు భారత్ తరపున అతడు ఆడిన తీరు అద్భుతం. అదే ఆటను ఐపీఎల్లోనూ కొనసాగిస్తాడని భావిస్తున్నా. అతడు ఇప్పుడు చాలా విశ్వాసంతో కనిపిస్తున్నాడు. ఇది మంచి పరిణామం. ఇకపోతే, పంత్ను ధోనీతో పోల్చుతున్నారు. ఇది సరికాదు. పంత్ ధోనీ కంటే మెరుగ్గా ఆడగలడు. తనదైన రోజున మ్యాచ్ను ఒంటిచేత్తో గెలిపించే సత్తా అతడికి ఉంది' అని పార్థీవ్ పేర్కొన్నాడు.