20 మంది ఎంపీల మద్దతు సాధించిన భారత సంతతి ఎంపీ
లండన్: బ్రిటన్ ప్రధానమంత్రి రేసులో మాజీ చాన్స్లర్ రిషి సునక్ దూసుకెళుతున్నారు. తన నామినేషన్కు అవసరమైన 20 మంది కన్జర్వేటివ్ పార్టీ ఎంపీల సపోర్ట్ను ఆయన సాధించారు. పదవి నుంచి తప్పుకోవాలని బోరిస్ జాన్సన్ నిర్ణయించుకోవడంతో సెప్టెంబర్ 5న బ్రిటన్ కొత్త ప్రధానిని ఎన్నుకోనున్నారు. ప్రధానమంత్రి పదవి కోసం మంగళవారం నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. భారత సంతతికి చెందిన 42 ఏండ్ల రిషి సునక్ యార్క్షేర్ నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రుషి సునక్తో పాటు ట్రేడ్ మినిస్టర్ పెన్నీ మోర్డౌంట్, కొత్త చాన్స్లర్ నదీమ్ జహావీ, టామ్ టుగెన్ధాత్ తదితరులు ప్రధాని రేసులో ఉన్నారు. వీరంతా 20 మంది ఎంపీల మద్దతు కోసం ప్రయత్నిస్తున్నారు. భారత సంతతికే చెందిన సుయెల్లా బ్రావెర్మన్, ఫారిన్ సెక్రెటరీ లిజ్ ట్రస్, నైజీరియా సంతతికి చెందిన కిమి బడెనోచ్, విదేశాంగ శాఖ మాజీ మంత్రి జెర్మీ హంట్, రవాణా మంత్రి గ్రాంట్ షాప్స్, ఫారిన్ ఆఫీస్ మినిస్టర్ రెహ్మాన్ ఛిస్తీ, వైద్య శాఖ మాజీ మంత్రి సాజిద్ జావెద్ తదితరులు కూడా ప్రధాని పదవి కోసం పోటీ పడుతున్నారు. భారత సంతతికే చెందిన హోం సెక్రెటరీ ప్రీతి పటేల్ తొలుత పోటీకి సిద్ధపడినా.. మంగళవారం తప్పుకున్నారు.
సెప్టెంబర్ 5న కొత్త ప్రధాని ఎంపిక
1922 కమిటీ సోమవారం ప్రధానమంత్రి పదవికి సంబంధించిన టైం టేబుల్ను ప్రకటించింది. సెప్టెంబర్ 5న ప్రధానిని ఎన్నుకుంటారు. సెప్టెంబర్ 7న పార్లమెంట్ను ఉద్దేశించి కొత్త ప్రధాని ప్రసంగిస్తారు. షెడ్యూల్ ప్రకారం తొలి రౌండ్ ఓటింగ్ బుధవారం జరగనుంది. ఈ రౌండ్లో ప్రతి అభ్యర్థి 30 మంది ఎంపీల మద్దతును సాధించాలి. గురువారం జరిగే రెండో బ్యాలెట్లో అతి తక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థులు పోటీ నుంచి తప్పుకోవాల్సి వస్తుంది. ఈ వారం చివరి నాటికి ఇద్దరు అభ్యర్థులకు పోటీ చేరుకోకుంటే వచ్చే వారం కూడా తదుపరి రౌండ్ల ఓటింగ్ జరుగుతుంది. పోటీ ఇద్దరు ఫైనలిస్టుల వరకు రావడానికి జులై 21 వరకు సమయం ఉంది. వీరిద్దరూ పార్టీ మెంబర్షిప్ బ్యాలట్ను ఎదుర్కొంటారు.