ములుగు జిల్లా: మంగపేట మండలం చుంచుపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన ఆడుకుంటున్న పిల్లల మీద పడిపోయింది లారీ. యువకులు, చిన్నారులతో కలసి సరదాగా ఆడుకుంటుండగా.. వేగంగా వస్తున్న లారీ అదుపుతప్పి రెప్పపాటులో పిల్లలపైకి పడిపోయింది. స్థానికులు వెంటనే స్పందించి లారీకింద ఉన్న ఇద్దరు పిల్లలను బయటకు తీశారు.
కల్తీ దిలీప్ (16), కొమురం గోపీచంద్ (18)లుగా గుర్తించారు. తీవ్రంగా గాయపడిన వీరిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అలాగే లారీ కింద చిక్కుకున్న పాలబోయిన సాయి (11) చిన్నారిని బయటకు తీసేందుకు స్థానికులు చాలా సేపు ప్రయత్నించారు. అరగంటకుపైగా తీవ్రంగా శ్రమించి సాయి అనే బాలుడ్ని బయటకు తీసి హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారికి ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతోంది.