- ట్రాఫిక్ మానిటరింగ్ కు వలంటీర్లు ఉండాలి
- స్కూల్ బస్సుల్లో అటెండర్ తప్పనిసరి
- పార్కింగ్కు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలి
- మేనేజ్మెంట్లకు సూచించిన సిటీ ట్రాఫిక్ చీఫ్ సుధీర్ బాబు
హైదరాబాద్, వెలుగు:స్కూల్ జోన్స్లో ట్రాఫిక్ మానిటరింగ్పై సిటీ ట్రాఫిక్ పోలీసులు ఫోకస్ పెట్టారు. రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు స్కూళ్ల మేనేజ్మెంట్ తో మంగళవారం సమావేశం నిర్వహించారు. ట్రాఫిక్ చీఫ్, అడిషనల్ సీపీ సుధీర్ బాబు ఆధ్వర్యంలో సమీక్ష జరిపారు. సిటీ కమిషనరేట్ పరిధిలోని స్కూల్స్ టైమింగ్స్, ట్రాఫిక్ రద్దీ, స్టూడెంట్ల రోడ్ సేఫ్టీ, బస్సుల ఫిట్నెస్ సంబంధిత వివరాలను చర్చించారు. ఈ సందర్భంగా సుధీర్బాబు మాట్లాడుతూ స్కూల్ జోన్లలో ట్రాఫిక్ రద్దీకి సంబంధించిన సమస్యలను వివరించారు. ట్రాఫిక్ మానిటరింగ్ చేయడానికి వలంటీర్లు లేదాసెక్యూరిటీ గార్డులను నియమించాలని సూచించారు.
స్కూల్ బయట వెహికల్స్ పార్కింగ్ వల్ల తలెత్తే సమస్యల గురించి తల్లిదండ్రులకు తెలియజేయాలని చెప్పారు. వెహికల్ పార్కింగ్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. స్కూల్ జోన్స్, టైమింగ్ షెడ్యూల్తో కూడిన ప్రతిపాదనలను తదుపరి సమావేశానికి ముందు తమకు అందించాలని సూచించారు. స్కూల్ బస్సుల్లో అటెండర్ తప్పనిసరిగా ఉండాలని ఆదేశించారు. ట్రాఫిక్ వలంటీర్లకు అవసరమైన శిక్షణను అందిస్తామని ఆయన తెలిపారు. సమావేశంలో ట్రాఫిక్ డీసీపీలు రాహుల్ హెగ్డే,అశోక్ కుమార్, శ్రీనివాస్ పాల్గొన్నారు.