హైదరాబాద్, వెలుగు: జంట నగరాల్లో రోడ్లను వేసే వారు వేస్తుంటే.. ఆ వెంటనే తవ్వే వారు తవ్వేస్తున్నారు. సిటీలో ఏదో ఓ చోట రోడ్ల తవ్వకాలు, మరమ్మతు పనులు నిత్యకృత్యంగా మారాయి. అధికారుల మధ్య సమన్వయం లేకపోవడంతో సమస్యలు తలెత్తుతున్నాయి. ఫలితంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అమీర్పేటలో రెండు నెలల క్రితం బల్దియా చేపట్టిన పైపులైన్ పనులు ప్రయాణికులకు నరకం చూపిస్తున్నాయి. ఎండాకాలం చేపట్టాల్సిన పనులు వానాకాలంలో చేపట్టడంతో సమస్య మరింత జఠిలమైంది. ఇటీవల కురిసిన వర్షాలకు మైత్రివనం నుంచి సత్యం థియేటర్ వరకు రహదారిపై భారీగా వరదనీరు నిలిచింది. పది నిమిషాల వర్షానికే మోకాలి లోతు నీరు నిలిచింది. సెల్లార్లు, దుకాణాల్లోకి భారీగా వర్షపు నీరు చేరింది. వ్యాపారులు తీవ్రంగా నష్టపోయారు. ఈ మార్గం గుండా ప్రయాణించే వారు తీవ్ర ఇక్కట్ల పాలయ్యారు. దీంతో బాధితులు అధికారులపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
మరమ్మతు పనుల్లో జాప్యం
సమస్య పరిష్కరించేందుకు భూగర్భ పైపులైన్ వేసి నీరు వెళ్లిపోయేలా ఏర్పాట్లు చేయాలని జీహెచ్ఎంసీ అధికారులు నిర్ణయించారు. సత్యం థియేటర్ చౌరస్తా నుంచి మైత్రి వనం వరకు భూగర్భ పైపులైన్ వేయాలని టెండర్లు పిలిచారు. రామచంద్రారెడ్డి అనే కాంట్రాక్టర్ పనులను దక్కించుకున్నాడు. రెండు నెలల క్రితం ప్రారంభించిన రెయిన్ డ్రైన్ వర్క్స్ ఇప్పుడిప్పుడే ఊపందుకుంటున్నాయి. మట్టిని తవ్వి రహదారులపైనే వేస్తున్నారు. ఇసుక, కంకర, గ్రానైట్ రాళ్లు రోడ్లపైనే వేస్తుండటంతో రాకపోకలకు ఇబ్బందులు కలుగుతున్నాయి. పాదచారులు సైతం నడిచేందుకు వీలులేకుండా పోతోంది. ఈ పనులు పూర్తి కావడానికి మరో రెండు నుంచి మూడు వారాల సమయం పట్టే అవకాశముందని సూపర్వైజర్ చెబుతున్నారు. దీంతో అప్పటివరకు ఇబ్బందులు పడాల్సిందేనని ప్రయాణికులు నిట్టూరుస్తున్నారు. వీలైనంత త్వరగా పనులు పూర్తి చేసి అసౌకర్యం కలగకుండా చూడాలని చెబుతున్నారు.
……………………….