- సత్యనారాయణ కాలనీలో ఘటన
కీసర, వెలుగు: దుండగులు డమ్మీ గన్తో బెదిరించారు.. బంగారం ఎత్తుకెళ్తుండగా అడ్డుపడిన యజమానిపై గొడ్డలితో దాడి చేయగా అతను తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని రాంపల్లి – ఘట్కేసర్ ప్రధాన రహదారిపై గల సత్యనారాయణ కాలనీలో చోటుచేసుకుంది. డీసీపీ రమణారెడ్డితెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం సాయంత్రం ఇద్దరు దుండగులు సత్యనారాయణ కాలనీలోని బాలాజీ జ్యువెలర్స్ కు వచ్చారు.
షాప్ యజమాని సందీప్ కుమారుడికి డమ్మీ గన్ చూపించి చంపేస్తామని బెదిరించారు. 4 తులాల బంగారం ఎత్తుకెళ్తుండగా.. సందీప్ అడ్డుకునే ప్రయత్నం చేశాడు. దీంతో వారు తమ వద్దనున్న గొడ్డలితో అతని తలపై బలంగా కొట్టి పరారయ్యారు. ఈ ఘటనలో బాధితుడికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న డీసీపీ రమణారెడ్డి, ఎస్ వోటీ డీసీపీ శ్రీధర్, అడిషనల్ డీసీపీ వెంకటరమణారెడ్డి, ఏసీపీ వెంకట్ రెడ్డి సంఘటన స్థలాన్ని పరిశీలించారు.
నిందితులు వదిలేసిన డమ్మీ గన్ స్వాధీనం చేసుకున్నారు. వారిని పట్టుకునేందుకు ఎస్ వోటీ, స్థానిక పోలీసులతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సీసీ ఫుటేటీ ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నట్లు పేర్కొన్నారు.
