
న్యూఢిల్లీ: ఎంపీ ప్రియాంకా గాంధీ భర్త, బిజినెస్ మ్యాన్ రాబర్ట్ వాద్రాకు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు మంగళవారం సమన్లు జారీ చేశారు. 2008లో హర్యానా ల్యాండ్ డీల్ కేసులో విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. ఢిల్లీలోని ఈడీ హెడ్ క్వార్టర్స్ కు రావాలని సూచించారు. ఇదే కేసులో వాద్రాను ఈ ఏడాది ఏప్రిల్ లో ఈడీ అధికారులు ప్రశ్నించారు.
మూడు రోజుల్లో 16 గంటల పాటు విచారించారు. కాగా.. 2008లో హర్యానాలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నపుడు రాబర్ట్ వాద్రాకు చెందిన స్కైలైట్ హాస్పిటాలిటీ కంపెనీ.. రైతుల నుంచి కొంత భూమిని రూ.7.5 కోట్లకు కొన్నది. తర్వాత ఆ ల్యాండ్ లో హౌసింగ్ సొసైటీని ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం నుంచి అనుమతి పొంది ల్యాండ్ వాల్యూని పెంచింది. 2012లో ఆ భూమిని డీఎల్ఎఫ్ కు రూ.58 కోట్లకు అమ్మేసింది. ఈ వ్యవహారంపై ఈడీ కేసు పెట్టింది.