మొత్తం ఏడాదికి  మాత్రం 7 శాతమే

మొత్తం ఏడాదికి  మాత్రం 7 శాతమే
  • జీడీపీ గ్రోత్​@16%
  • మొత్తం ఏడాదికి  మాత్రం 7 శాతమే
  • మొదటి క్వార్టర్​పై  డీబీఎస్​అంచనా

న్యూఢిల్లీ:  ఈ ఆర్థిక సంవత్సరం మొదటి క్వార్టర్​లో జీడీపీ గ్రోత్​ 16 శాతం వరకు ఉండొచ్చని డీబీఎస్​ గ్రూప్ రీసెర్చ్ అంచనా వేసింది. మొత్తం ఆర్థిక సంవత్సరం  గ్రోత్​ మాత్రం 7 శాతం వరకే ఉండొచ్చని తెలిపింది. ఇది విడుదల చేసిన రిపోర్టు ప్రకారం... ఈ సంవత్సరం ఆసియాలో అత్యంత వేగంగా అభివృద్ధి​ చెందుతున్న ఎకానమీగా భారతదేశం అవతరించింది. మన జీడీపీ 2022–-23 ఆర్థిక సంవత్సరం (ఏడాది లెక్కన) మొదటి క్వార్టర్​లో 4.1 శాతం నుండి 16 శాతానికి పెరిగే అవకాశం ఉంది. అధికారిక జీడీపీ లెక్కలు ఆగస్టు 31న విడుదల అయ్యే అవకాశం ఉంది. భారతదేశ గ్రాస్​ వాల్యూ యాడెడ్ (జీవీఏ)  14.5 శాతం వరకు ఉండొచ్చు.  అయితే, ఎకానమీకి పుంజుకునేందుకు బలమైన అవకాశాలు ఉన్నాయి కాబట్టి భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్​బీఐ)  వడ్డీ రేట్లను మరింతంగా పెంచే అవకాశం ఉంది.  దీని  లెక్కలను గమనిస్తే రేట్లు ఇంకా న్యూట్రల్​ లెవెల్​లో లేవని అర్థమవుతున్నది. బహుశా ఒకటి-రెండు పెంపులకు అవకాశాలు ఉన్నాయి. 

మరో 60 పాయింట్లు పెరిగే అవకాశం...

తాజా మానిటరీ పాలసీ కమిటీ సమావేశంలో, ఆర్​బీఐ ధరల పెరుగుదలను నియంత్రించడానికి రెపో రేటును 50 బేసిస్ పాయింట్లు పెంచి 5.40 శాతానికి తీసుకెళ్లింది. తాజా పెంపు రెపో రేటు  ప్రీ-పాండమిక్ స్థాయి 5.15 శాతం కంటే ఎక్కువ కావడాన్ని గమనించాలి. వడ్డీ రేటును పెంచడం వల్ల ఎకానమీలో డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తగ్గుతుంది కాబట్టి ధరలూ తగ్గుతాయి.  రిటైల్ ఇన్​ఫ్లేషన్​ ఇప్పుడు వరుసగా ఏడవ నెలలో ఆర్​బీఐ  అప్పర్​ టాలరెన్స్ బ్యాండ్ 6 శాతం కంటే ఎక్కువగా ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆర్​బీఐ ఇప్పటి వరకు మూడు సందర్భాల్లో కీలకమైన రెపో రేటును 140 బేసిస్ పాయింట్లు పెంచింది. ఈ  ఆర్థిక సంవత్సరంలోపు రెపో రేటును మరో 60 బేసిస్ పాయింట్లు పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. రెపో రేటును 6.0 శాతానికి తీసుకువెళ్లడానికి,  సెప్టెంబరులో 35 బేసిస్ పాయింట్లు, డిసెంబరులో మరో 25 బేసిస్ పాయింట్లను పెంచాలని ఆర్​బీఐ భావిస్తోంది.  డీబీఎస్​ గ్రూప్ రీసెర్చ్ చీఫ్ ఎకనామిస్ట్ ఈ సందర్భంగా మాట్లాడుతూ నిరుద్యోగిత ప్రీ-పాండమిక్ స్థాయికి తిరిగి వచ్చిందని అన్నారు.  లేబర్​ రేటు 2019 స్థాయిలో లేనప్పటికీ,  జీతాలు పెరుగుతున్నాయని వివరించారు.   ఇన్‌‌‌‌‌‌‌‌పుట్ ధరలు పెరగడం,  గ్లోబల్ గ్రోత్ ఔట్‌‌‌‌‌‌‌‌లుక్‌‌‌‌‌‌‌‌పై అనుమానాలు ఉన్నందున ప్రైవేట్​ క్యాపెక్స్​ కంటే పబ్లిక్​ క్యాపెక్స్​ ఎక్కువగా ఉండొచ్చని అన్నారు. వేడిగాలుల ఎఫెక్ట్​, వర్షాలు ఆలస్యంగా పడటం వల్ల కమోడిటీల ధరలు పెరిగే అవకాశాలు ఉన్నాయని, కార్పొరేట్ మార్జిన్లు తగ్గవచ్చని వివరించారు.