- అధికారుల నుంచి సూచనలు, సలహాలు కోరిన కమిషనర్ రోనాల్డ్ రాస్
హైదరాబాద్, వెలుగు : జీహెచ్ఎంసీలో శానిటేషన్ ప్రాబ్లమ్ పై ఏం చేద్దామని, ఎలా పరిష్కరిద్దామని కమిషనర్ రోనాల్డ్ రాస్ అధికారుల నుంచి సలహాలు, సూచనలు సేకరించారు. బల్దియా హెడ్డాఫీసులో బుధవారం శానిటేషన్ పై అడిషనల్, జోనల్ కమిషనర్లు, ఇతర అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి చర్చించారు. బల్దియా ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఎందుకు చెత్త సమస్య ఉంటుందని, ఎక్కడ లోపం ఉందని అధికారులను అడిగారు. రాంకీ సంస్థ సరిగా పనిచేస్తుందా? ఒకవేళ చేయకపోతే వారితో అగ్రిమెంట్ ప్రకారం కచ్చితంగా పనులు చేయించాలని ఆదేశించారు.
చెత్త రోడ్లపై వేయకుండా ప్రజల్లో అవేర్ నెస్ ఎలా తీసుకురావాలని సలహాలు ఇవ్వాలని అడిగారు. ధనంతుల ఏరియాలు, కాలనీల్లో మాదిరిగా బస్తీలో పరిస్థితులు ఉండవని ఇక్కడి వారిలో కూడా ఎలా అవగాహన కల్పించాలన్నారు. స్వచ్ఛ ఆటోలు వెళ్లలేని చోట నుంచి ఎలా చెత్తను సేకరించవచ్చన్నారు. జీవీపీ పాయింట్ల వద్ద చెత్త వేయకుండా ఉండేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో అడిషనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి, జోనల్ కమిషనర్లు స్నేహ శబరీష, అభిలాష అభినవ్, రవి కిరణ్ పాల్గొన్నారు.