
కర్నూల్: కర్నూలు జిల్లాలో భారీ మొత్తంలో నగదు పట్టుబడింది. కర్నూల్ సమీపంలోని పంచలింగాల చెక్పోస్టు వద్ద ఆర్టీసీ బస్సులో రూ. 1.9 కోట్లను పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు.అనంతపురంలోని మారుతినగర్ కు చెందిన కోనేరు రామచౌదరి, గుంతకల్లుకు చెందిన రంగనాయకులు కుప్పం డిపో కు చెందిన బస్సులో హైదరాబాద్ నుండి కర్నూల్ వైపు వస్తున్నారు. వీరిలో కోనేటీ రామచౌదరి తన బ్యాగ్లో రూ. 1.9 కోట్ల నగదును తరలిస్తున్నారు.ఈ విషయమై పోలీసులకు కచ్చితమైన సమాచారం అందింది. ఈ సమాచారం మేరకు పోలీసులు పంచలింగాల చెక్ పోస్టు వద్ద బస్సును తనిఖీ చేస్తే వీరి నుండి రూ. 1.9 కోట్లను స్వాధీనం చేసుకొన్నారు.
ఈ నగదుకు సంబంధించి పత్రాలను చూపాల్సిందిగా పోలీసులు అడగ్గా… రామ చౌదరి రసీదులను చూపకపోగా, పొంతనలేని సమాధానాలు చెప్పాడు. దీంతో పోలీసులు ఆ డబ్బును సీజ్ చేశారు. ఈ విషయాన్ని కర్నూలు డీఎస్పీ మీడియా సమావేశంలో వెల్లడించారు. దీనిపై కేసు నమోదు చేశామని తెలిపారు. డబ్బు ఎవరి దగ్గర నుంచి తీసుకువస్తున్నారు? ఎందుకు తీసుకువస్తున్నారు? అనే విషయాలపై స్పష్టత లేనందున దీనిపై మరింత లోతుగా విచారిస్తామని డీఎస్పీ మహేష్ తెలిపారు.