న్యూఢిల్లీ: రూ. రెండు వేల నోట్లను విత్డ్రా చేసుకోవడం వలన ఎకానమీకి మంచిదేనని టాప్ ఎకనామిస్ట్లు చెబుతున్నారు. ఈ నిర్ణయంతో దేశ జీడీపీ గ్రోత్ రేట్ పెరుగుతుందని అంచనావేస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ గ్రోత్ రేట్ ఆర్బీఐ అంచనావేసిన 6.5 శాతం కంటే ఎక్కువగా ఉంటుందని ఎస్బీఐ ఓ రిపోర్ట్లో పేర్కొంది. 2023–24 లోని మొదటి క్వార్టర్లో రియల్ జీడీపీ గ్రోత్ రేట్ 8.1 శాతంగా ఉంటుందని అంచనా వేసింది. రూ. 2 వేల నోట్ల విత్డ్రా ప్రభావంతో జీడీపీ గ్రోత్ మరింత ఎక్కువగా పెరిగే అవకాశం ఉందని వెల్లడించింది. సర్క్యులేషన్లోని రూ.2 వేల నోట్లను విత్డ్రా చేసుకుంటున్నామని కిందటి నెల19 న ఆర్బీఐ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది మార్చి 31 నాటికి సిస్టమ్లో రూ.3.62 లక్షల కోట్ల విలువైన రూ.2 వేల నోట్లు సర్క్యులేషన్లో ఉన్నాయి. అంటే మొత్తం కరెన్సీలో వీటి వాటా 10.8 శాతానికి సమానం. ఆర్బీఐ లెక్కల ప్రకారం, ఇందులో రూ.1.8 లక్షల కోట్ల విలువైన రూ.2 వేల నోట్లు తిరిగి బ్యాంకుల్లోకి వచ్చాయి. వీటిలో రూ.1.5 లక్షల కోట్లు లేదా 85 శాతం అమౌంట్ డిపాజిట్ల రూపంలో రాగా, మిగిలిన అమౌంట్ చిన్న కరెన్సీల ఎక్స్చేంజ్ రూపంలో వ్యవస్థలోకి వచ్చింది.
వినియోగానికి బూస్ట్..
ఆర్బీఐ రూ. 2 వేల నోట్ల విత్డ్రా నిర్ణయాన్ని ప్రకటించిన తర్వాత మాల్స్, జ్యువెలరీ స్టోర్లు, పెట్రోల్ పంపులకు కస్టమర్లు క్యూ కట్టడం పెరిగింది. రియల్ ఎస్టేట్ సెక్టార్లో ల్యాండ్ డీల్స్ కూడా పెరిగాయి. ఈ నిర్ణయంతో వ్యవస్థలో రూ.55 వేల కోట్ల విలువైన వినియోగం అదనంగా జరుగుతుందని ఎస్బీఐ రిపోర్ట్ అంచనావేసింది. రూ. 3.08 లక్షల కోట్ల విలువైన రూ.2 వేల నోట్లు డిపాజిట్ల రూపంలో బ్యాంకుల్లోకి వస్తాయని పేర్కొంది. ఇందులో రూ.92 వేల కోట్లు సేవింగ్స్ అకౌంట్లలోకి వస్తాయని, ఇందులో 60 శాతం అమౌంట్ వెంటనే విత్డ్రా అవుతుందని పేర్కొంది. దీంతో వినియోగం రూ.55 వేల కోట్లు పెరుగుతుందని తెలిపింది. లాంగ్టర్మ్లో వినియోగం అదనంగా రూ.1.83 లక్షల కోట్లు పెరగొచ్చని లెక్కించింది. ‘ రూ. 2 వేల నోట్లను విత్డ్రా చేసుకోవడంతో జరిగిన అతిపెద్ద ప్రయోజనం..వ్యవస్థలో వినియోగం పెరగడం. ఎక్కువ వాల్యూ అమౌంట్తో ఎక్కువ వాల్యూ ఉన్న ప్రొడక్ట్లపై ఖర్చు పెరుగుతుంది. గోల్డ్ లేదా జ్యువెలరీ, ఏసీ, మొబైల్ ఫోన్స్, రియల్ ఎస్టేట్ వంటి హై ఎండ్ కన్జూమర్ ప్రొడక్ట్లపై ఖర్చు చేయడం పెరుగుతుంది’ అని ఎస్బీఐ పేర్కొంది. ఈ సందర్భంగా బంకుల దగ్గర పేమెంట్స్ పెరగడాన్ని, జొమాటో క్యాష్ ఆన్ డెలివరీల్లో రూ.2 వేల నోట్లతో పేమెంట్స్ పెరగడాన్ని ప్రస్తావించింది. అంతేకాకుండా గుడులు, ఇతర మతపరమైన సంస్థలకు డొనేషన్లు పెరుగుతాయని కూడా ఎస్బీఐ ఆర్థికవేత్తలు అంచనావేస్తున్నారు. రూ. 2 వేల నోట్ల విత్డ్రా వలన సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ) వాడకం పెరుగుతుందని ఎస్బీఐ రిపోర్ట్ పేర్కొంది. ఇప్పటికే రిటైల్ సీబీడీసీని పైలెట్గా వాడుతున్నారు. పెద్ద నోట్లు లేకపోతే ఈ–రూపాయి వాడకం పెరుగుతుందని వెల్లడించింది.
ఎస్బీఐ అంచనాల ప్రకారం, బ్యాంకుల్లోకి రూ.2 వేల నోట్లు ఇలా వస్తాయి..
- మొత్తం విత్డ్రా చేసుకున్న రూ. 2 వేల నోట్లు- రూ.3.62 లక్షల కోట్లు
- డిపాజిట్ల రూపంలో రానున్న అమౌంట్- రూ.3.08 లక్షల కోట్లు
- ఎక్స్చేంజ్ అవ్వనున్న అమౌంట్- రూ.54 వేల కోట్లు
- సేవింగ్స్ అకౌంట్లలోకి వచ్చే అమౌంట్ - రూ. 92 వేల కోట్లు (30 శాతం)
- కరెంట్ అకౌంట్లోకి వచ్చే అమౌంట్- రూ. 1.23 లక్షల కోట్లు (40 శాతం)
- లోన్ అకౌంట్లోకి - రూ.92 వేల కోట్లు (30 శాతం)
- సేవింగ్స్ అకౌంట్ల నుంచి విత్డ్రా అయ్యే అమౌంట్- రూ.55 వేల కోట్లు
- దీంతో వ్యవస్థలో వినియోగం పెరుగుతుంది. జీడీపీ జూన్ క్వార్టర్లో 8.1 శాతం గ్రోత్ నమోదు చేస్తుంది.
గోల్డ్ జ్యువెలరీ అమ్మకాలు అప్..
ఆర్బీఐ నోట్ల విత్డ్రాను ప్రకటించిన తర్వాత గోల్డ్ జ్యువెలరీ సేల్స్ 10–20 శాతం మేర పెరిగాయని అంచనా. రోజువారీ అత్యవసరమైన ప్రొడక్ట్లు, ప్రీమియం బ్రాండ్ల సేల్స్ కూడా పుంజుకున్నాయి. ‘హౌసింగ్ మార్కెట్ (అపార్ట్మెంట్ల సేల్స్) లో రూ.2 వేల నోట్ల ప్రభావం చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకుంటే చాలా మంది బ్రాండెడ్ డెవలపర్లు తమ ట్రాన్సాక్షన్లను క్లీన్గా ఉంచుకోవాలని చూస్తున్నారు. డీమానిటైజేషన్ తర్వాత నుంచి హౌసింగ్ మార్కెట్లో క్యాష్ ట్రాన్సాక్షన్లు లేదా బ్లాక్ మనీ వాడకం బాగా తగ్గింది. ఆర్బీఐ నోట్ల విత్డ్రా నిర్ణయం చూస్తుంటే ప్రభుత్వం బ్లాక్ మనీని అరికట్టడంలో కఠినంగా ఉందని అర్థమవుతోంది. దీంతో రియల్ ఎస్టేట్ మార్కెట్లో పారదర్శకత పెరుగుతుంది. ఇంకా రూ.2 వేల నోట్ల విత్డ్రా వలన ల్యాండ్ డీల్స్ పెరిగినా ఆశ్చర్యం లేదు’ అని రియల్ఎస్టేట్ కన్సల్టెన్సీ అనరాక్ గ్రూప్ సీనియర్ డైరెక్టర్ ప్రశాంత్ ఠాకూర్ అన్నారు.