
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) సవరించిన ఏటీఎం వినియోగ ఛార్జీలు గురువారం నుంచి అమలులోకి వచ్చాయి. ఒక కస్టమర్ నెలలో ఉచిత లావాదేవీలను వాడిన తర్వాత ప్రతీ విత్డ్రాపై గరిష్టంగా రూ.23 చెల్లించాల్సి ఉంటుంది. గతంలో ఇటువంటి లావాదేవీకి రూ.21 వరకు బ్యాంకులు వసూలు చేశాయి. కస్టమర్లు తమ సొంత బ్యాంక్ ఏటీఎం నుంచి ప్రతి నెలా ఐదు ఉచిత లావాదేవీలను (ఆర్థిక, ఆర్థికేతర లావాదేవీలతో సహా) జరుపుకోవచ్చు. అదే విధంగా, ఇతర బ్యాంక్ఏటీఎంల నుంచి కూడా ఉచిత లావాదేవీలు జరుపుకోవచ్చు.
కానీ, ఈ నెంబర్ మెట్రో సిటీల్లో అయితే మూడు లావాదేవీల వరకు, నాన్-మెట్రోల్లో అయితే ఐదు లావాదేవీల (ఆర్థిక, ఆర్థికేతర లావాదేవీలతో సహా) వరకు లిమిట్ ఉంది. ఏటీఎం ఇంటర్చేంజ్ ఫీజులను ఈ ఏడాది మార్చి 28న ఆర్బీఐ సవరించింది. ఈ రూల్స్ క్యాష్ డిపాజిట్ లావాదేవీలకు వర్తించవు. ఈ ఏడాది మార్చి చివరి నాటికి దేశం మొత్తం మీద 2,55,885 బ్యాంక్ ఏటీఎంలు, క్యాష్ రీసైక్లర్ మెషీన్స్ (సీఆర్ఎంలు), వైట్ లేబుల్ ఏటీఎంలు (డబ్ల్యూఎల్ఏలు) అందుబాటులో ఉన్నాయి.