
మంచిర్యాల, వెలుగు: ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించి సీఎమ్మార్ కోసం ఇచ్చిన వడ్లను మిల్లర్లు మాయం చేశారు. సర్కారుకు సకాలంలో బియ్యం అప్పగించకుండా, రికవరీ డబ్బులు చెల్లించకుండా ముప్పుతిప్పలు పెడుతున్నారు. మంచిర్యాల జిల్లాలో దాదాపు రూ.130 కోట్ల విలువైన సీఎమ్మార్ బకాయిలు పేరుకుపోయాయి. దీంతో 23 మిల్లులపై క్రిమినల్ కేసులు పెట్టడంతో పాటు పలు మిల్లులపై రెవెన్యూ రికవరీ (ఆర్ఆర్) యాక్టు ప్రయోగించినా మిల్లర్లు లైట్ తీసుకుంటున్నారు.
కొంతమంది కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకొని కేసుల నుంచి టెంపరరీగా రిలీఫ్ పొందారు. ఇదిలా ఉండగా, హాజీపూర్ మండలం నర్సింగాపూర్లోని మరో రెండు రైస్ మిల్లులు ఏకంగా రూ.45 కోట్ల విలువైన సీఎమ్మార్ ఎగ్గొట్టాయి. దీంతో సదరు మిల్లులపై సివిల్ సప్లైస్ అధికారులు కొరడా ఝుళిపించారు. డీఎం శ్రీకళ ఫిర్యాదు మేరకు హాజీపూర్ పోలీసుల మిల్లుల నిర్వాహకులపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు.
ఒక్క మిల్లులోనే రూ.30.57 కోట్లు....
నర్సింగాపూర్లోని రాజరాజేశ్వర ట్రేడర్స్కు 2022-23 యాసంగి, 2024-–25 యాసంగి, 2024-–25 వానాకాలం సీజన్లలో 13,948 మెట్రిక్ టన్నుల వడ్లను కేటాయించారు. వీటిని మిల్లింగ్ చేసి క్వింటాల్కు 68 కిలోల చొప్పున 9,479 టన్నుల బియ్యం ఇవ్వాల్సి ఉండగా, ఇప్పటివరకు 3,152 టన్నులు మాత్రమే డెలివరీ చేశారు. ఇంకా 6,327 మెట్రిక్ టన్నుల సీఎమ్మార్ పెండింగ్ ఉన్నారు. దీనికి సమానమైన 9,305 మెట్రిక్ టన్నులు ప్యాడీ మిల్లులో బ్యాలెన్స్ ఉండాలి.
కానీ అందులోంచి 8,578.815 టన్నుల వడ్లను దుర్వినియోగం చేసినట్టు సివిల్ సప్లైస్ అధికారులు గుర్తించారు. పెండింగ్ బియ్యం టన్నుకు రూ.36,448.20 చొప్పున రూ.22 కోట్ల 31 లక్షల 61వేల 693 బకాయిలుగా లెక్క తేల్చారు. దానిపై 25 శాతం పెనాల్టీ ప్లస్ 12 పర్సెంట్ ఇంట్రెస్ట్ కలుపుకొని మొత్తం రూ.30 కోట్ల 57 లక్షల 31 వేల 520 రికవరీ చేయాల్సి ఉంది. దీంతో ఈ మిల్లు యజమానులు కేతిరెడ్డి మల్లారెడ్డి, గంప సంతోష్కుమార్లపై బీఎన్ఎస్ 316(2), 316 (5), 318 (4), రెడ్విత్ 3(5) సెక్షన్ల కింద క్రిమినల్ కేసులు నమోదు చేశారు.
మరో మిల్లులో రూ.15 కోట్లకు పైనే....
నర్సింగాపూర్లోని శ్రీసాయి మణికంఠ ట్రేడర్స్ సైతం అసలు, జరిమానా, వడ్డీతో కలిపి రూ.15 కోట్లకు పైగా లెక్క తేలింది. ఈ మిల్లుకు 2022–-23 యాసంగి, 2023-–24 యాసంగి సీజన్లలో 6,329 మెట్రిక్ టన్నుల ప్యాడీ కేటాయించారు. 4,304 టన్నుల సీఎమ్మార్కు గాను ఇప్పటివరకు 1,374 టన్నులు మాత్రమే తిరిగిచ్చారు. ఇంకా 2,929.686 మెట్రిక్ టన్నులు పెండింగ్ ఉన్నాయి. బ్యాలెన్స్ ప్యాడీ 4,308 టన్నులకు గాను 4,108.127 టన్నులు దుర్వినియోగం చేసినట్టు తేలింది.
పెండింగ్ సీఎమ్మార్ విలువ టన్నుకు రూ.36,448.20 చొప్పున రూ.10 కోట్ల 35 లక్షల 8వేల 986 కాగా, దీనిపై 25 పర్సెంట్ పెనాల్టీ, 12 పర్సెంట్ ఇంట్రెస్ట్ కలిపి మొత్తం రూ.14 కోట్ల 18 లక్షల 7వేల 312 బకాయిలు ఉన్నాయి. ఇవిగాకుండా 2021-–22 వానాకాలం, యాసంగి సీజన్లకు సంబంధించిన 195.868 టన్నుల బియ్యానికి రూ.68 లక్షల 19 వేల 605 పెండింగ్ ఉన్నాయి. మిల్లు యజమాని గంప శ్రావణ్కుమార్పై ఐపీసీ 406, 409, 420 సెక్షన్ల కింద కేసు ఫైల్ చేశారు.