మెదక్ లో సిమ్ కార్డు మార్చి రూ.91,500 చోరీ

 మెదక్ లో సిమ్ కార్డు మార్చి రూ.91,500  చోరీ

మెదక్​ టౌన్​, వెలుగు :  ఫోన్​ మాట్లాడతానని ఓ వ్యక్తి వద్ద నుంచి గుర్తు తెలియని మరో వ్యక్తి ఫోన్​ తీసుకొని సిమ్ కార్డును మార్చివేసి డబ్బులు అపహరించిన సంఘటన మెదక్​ పట్టణంలోని రైల్వేస్టేషన్​లో చోటు చేసుకుంది. మెదక్ టౌన్ సీఐ మహేష్​ తెలిపిన వివరాల ప్రకారం...కామారెడ్డి జిల్లా సదాశివనగర్​ గ్రామానికి చెందిన దౌడగారి నీలం రెడ్డి అనే వ్యక్తి తన భార్యతో కలిసి గత నెల 26న కామారెడ్డి నుంచి మెదక్​కు ట్రైన్​లో వచ్చారు.

 ఈ సమయంలో మెదక్ రైల్వేస్టేషన్​లో ఓ గుర్తు తెలియని వ్యక్తి తన ఫోన్​ పని చేయడంలేదని...అర్జంట్​గా ఫోన్​ చేసుకోవాలని నీలంరెడ్డిని అడగ్గా ఆయన ఫోన్​ ఇచ్చారు. ఈ క్రమంలో ఫోన్​ మాట్లాడుతున్నట్లు అప్పటికప్పుడే సిమ్​కార్డును గుర్తు తెలియని వ్యక్తి ఫోన్​లోకి వేసుకొని... వేరే సిమ్​ను నీలంరెడ్డి ఫోన్​లో వేసి ఇచ్చారు. అనంతరం బాధితుడైన నీలంరెడ్డి అకౌంట్​లో నుంచి రూ.91,500 చోరీ జరిగినట్లు గుర్తించారు.

 ఈ మేరకు మెదక్​ టౌన్​ పోలీసులకు నీలంరెడ్డి ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు నిందితున్ని పట్టుకోవడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రజలు గుర్తు తెలియని వ్యక్తులకు నమ్మి వారి ఫోన్​లు ఇవ్వరాదని సీఐ మహేష్​ కోరారు.