![సర్పంచులు తీసుకోవాల్సింది ప్రాణాలు కాదు.. సీఎం కుర్చీ : RS ప్రవీణ్ కుమార్](https://static.v6velugu.com/uploads/2023/02/praveen_xLUbWO5u3G.jpg)
రాష్ట్రంలో సర్పంచుల భాదలు వర్ణనాతీతంగా ఉన్నాయి. చేసిన పనులకు బిల్లులు రాక, అప్పులు తీర్చలేక చాలా మంది రోడ్డెక్కుతున్నారు. మరి కొందరు అప్పల బాధ తాళ లేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతున్నారు. సోమవారం నిర్మల్ జిల్లా వేణునగర్ సర్పంచ్ రాధ అప్పుల బాధతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటనపై బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ స్పందించారు. సర్పంచులకు రావాల్సిన డబ్బులను కేసీఆర్ గుట్టు చప్పుడు కాకుండా మిగతా రాష్ట్రాలకు తరలించారని ఆరోపించారు. వాటిని కాపాడుకోవడం కోసమే కేసీఆర్ బీఆర్ఎస్ అంటూ కొత్త నాటకమాడుతున్నారని విమర్శించారు. సర్పంచులు ఆత్మహత్యలకు పాల్పడకుండా బీఎస్పీకి ఓటేసి సీఎం కుర్చీ గుంజుకోవాలని సూచించారు.
‘సర్పంచ్ అక్కలారా, అన్నలారా, మన బిల్లులకు కావలసిన డబ్బును కేసీఆర్ మిగతా రాష్ట్రాలకు గుట్టుచప్పుడు కాకుండా తరలించిండు. దాన్ని కాపాడుకోవడం కోసమే బీఆర్ఎస్ పార్టీ అంటూ నాటకమాడుతున్నడు. ఇప్పుడు మనం తీసుకోవాల్సింది ప్రాణాలు కాదు, బీఎస్పీకి ఓటేసి మన కుర్చీ మనం గుంజుకోవాలె’ అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ట్వీట్ చేశారు.