- జరిమానాల కింద రూ.1.30 లక్షల వసూలు
హైదరాబాద్ సిటీ, వెలుగు: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఆర్టీఏ అధికారులు ప్రైవేట్ బస్సుల తనిఖీలు ముమ్మరం చేశారు. సంక్రాంతి రద్దీ నేపథ్యంలో అధిక చార్జీలను వసూలు చేస్తుండడంతో పాటు కొందరు ప్రైవేట్ ఆపరేటర్లు ఫిట్నెస్ లేని వాహనాలను నడుపుతున్నట్టు అధికారుల తనిఖీల్లో వెల్లడైంది. ఈ నెల 7 నుంచి ప్రారంభమైన ఈ తనిఖీల్లో ఇప్పటి దాకా 75 ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై కేసులు నమోదు చేసినట్లు రవాణా శాఖ అధికారులు తెలిపారు. రూ.1.30 లక్షల జరిమానా విధించినట్టు పేర్కొన్నారు.
ప్రయాణికులు తీసుకెళ్లే బస్సుల్లో గూడ్స్ తీసుకువెళ్లడం, ప్రయాణికుల లిస్ట్, ఫస్ట్ ఎయిడ్ బాక్స్ లేకపోవడం లాంటి రూల్స్ను బ్రేక్ చేస్తున్నారని చెప్పారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో 8 తనిఖీ బృందాలు ఏర్పాటు చేశారు. సంక్రాంతి రద్దీ నేపథ్యంలో ప్రైవేట్ బస్సుల్లో అధిక చార్జీలు వసూలు చేయరాదని, స్టేజీ క్యారేజీగా బస్సులు తిప్పొద్దని రవాణా శాఖ హెచ్చరించింది. త్వరలో స్లీపర్ బస్సుల నిర్వహణ పై మార్గదర్శకాలు జారీ చేస్తామని తెలిపారు.
