- పీఎంఈ -డ్రైవ్ కార్యక్రమంలో భాగంగా సరఫరా చేయనున్న ఒలెక్ట్రా
- లెటర్ ఆఫ్ ఇండెంట్ జారీ చేసిన ఆర్టీసీ
హైదరాబాద్, వెలుగు: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఆర్టీసీ వంద శాతం ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణ ప్రణాళికలో భాగంగా తాజాగా ఆర్టీసీ 1,085 బస్సులను కొనుగోలు చేయనుంది. ఈ మేరకు ఈవీ బస్సుల సరఫరా సంస్థ ఒలెక్ట్రాకు సోమవారం లెటర్ ఆఫ్ ఇండెంట్(ఎల్ఓఐ) జారీ చేసింది.
పీఎంఈ డ్రైవ్ పథకంలో భాగంగా పర్యావరణ అనుకూల ఇంధన, విద్యుత్ వాహనాలను ప్రోత్సహించే కన్వర్జెన్స్ ఎనర్జీ సర్వీసెస్ లిమిటెడ్ (సీఈఎస్ఎల్) ఆధ్వర్యంలో ఈ లెటర్ను జారీ చేసింది. గ్రేటర్లో ఆర్టీసీ 3,200 బస్సులను నడుపుతోంది. అందులో 280 ఎలక్ట్రిక్ బస్సులు ఉన్నాయి. వచ్చే ఏడాదికి మరో వెయ్యి బస్సులను నగర రోడ్లపైకి తీసుకురానున్నది.
అందులో భాగంగానే తాజాగా కొత్త ఈవీ బస్సులకు ఆర్డర్ ఇచ్చింది. ఆర్టీసీకి ఒలెక్ట్రా12 మీటర్ల పొడవున్న లోఫ్లోర్ బస్సులను సరఫరా చేస్తుందని అధికారులు తెలిపారు. ఇందులో ఏసీ, నాన్-ఏసీ బస్సులు ఉన్నాయి. స్థానిక రోడ్ల పరిస్థితులకు అనుగుణంగా వాటిని రూపొందించారు.
బస్సు ముందు, వెనుక భాగంలో ఆధునిక ఎయిర్ సస్పెన్షన్ వ్యవస్థతో ఒక్కసారి చార్జ్ చేస్తే 250 కిలోమీటర్లకు పైగా ప్రయాణిస్తాయి. సుమారు 45 నిమిషాల్లో చార్జింగ్ అయ్యే సౌకర్యం ఈ బస్సుల్లో ఉంది. బస్సులో వీల్చైర్ వినియోగదారులకు ప్రత్యేక స్థలం కేటాయించారు.
